సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని అరెస్టు
హైదరాబాద్కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు.;
By : The Federal
Update: 2025-06-09 06:55 GMT
సాక్షి టీవీ యాంకర్, సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని నివాసానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ఆయనను అరెస్టు చేశారు. హైదరబాద్ నుంచి కొమ్మినేనిని విజయవాడకు తీసుకొస్తున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి మహిళలను కించపరిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ మేరకు కొమ్మినేని శ్రీనివాసరావు మీద గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి టీవీ చానల్లో ఇటీవల నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడుతూ అమరావతి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆయనపై అమరావతి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో చర్చ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావుపైన విమర్శలు ఎక్కుపెట్టారు.
ఆ మేరకు ఇరువురుపైన మంగళగిరి, తుళ్లూరు పోలీసు స్టేషన్లతో అమరావతి మహిళలు ఫిర్యాదులు చేశారు. రాజధాని రైతులు, మహిళలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదుల మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతం తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోకి వస్తుండటం మూలంగా తాడికొండ ఎస్సీ నియోజక వర్గం కావడం వల్ల ఈ నియోజక వర్గంలోని దళిత మహిళలను కించపరిచారని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే కేవలం కొమ్మినేని శ్రీనివాసరావుపైనే కాకుండా చర్చలో పాల్గొన్న సీరియర్ జర్నలిస్టు కృష్ణంరాజుతో పాటుగా సాక్షి యాజమాన్యంపైన కూడా ఈ రకమైన అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.