సీఐడీ విచారణకు హాజరైన సజ్జల

రోడ్డుపైనే వాహనాన్ని పోలీసులు నిలిపి వేయడంతో సజ్జల రామకృష్ణారెడ్డి నడుచుకుంటూనే సీఐడీ కార్యాలయంలోకి వెళ్లారు.;

Update: 2025-05-09 08:35 GMT

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ విచారణకు వైసీపీ కీలక నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌లు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నారని, విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వీరు శుక్రవారం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌లతో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే వారిని పోలీసులు లోపలకి అనుమతించ లేదు. మరో వైపు కోర్టు ముందు రోడ్డుపైనే సజ్జల వాహనాన్ని పోలీసులు నిలపి వేశారు. దీంతో అక్కడ నుంచి నడుచుకుంటూనే సీఐడీ కార్యాలయంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు.

సజ్జల విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీఐడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరింప చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు పోలీసులు పిలిచారని, ఒక బాధ్యత గల పౌరుడిగా సీఐడీ విచారణకు హాజరయ్యాను అని చెప్పారు. గతంలో తనను పోలీసులు విచారిస్తే.. ఇప్పుడు సీఐడీ అధికారులు విచారించినట్లు చెప్పారు. గతంలో చెప్పిన సమాధానమే ఇప్పుడు చెప్పానని, టీడీపీ కార్యాలయంపై దాడి సమయంలో తాను ఉప ఎన్నికల హడావుడిలో ఉన్నానని, కానీ ఈ దాడులను తాను సమర్థించడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డారనే కారణంతో ఈ కేసులో పలువురి మీద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌లపైన కూడా కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో సజ్జలపై గతంలో లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. తొలుత స్థానిక పోలీసులు విచారణ చేపట్టిన ఈ కేసును కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీకీ అప్పగించారు.
Tags:    

Similar News