కేంద్రానికి సాయిరెడ్డి సూచన
గుండె జబ్బులను సీరియస్ గా తీసుకొని,సమగ్ర అవగాహన కల్పించండి;
By : V V S Krishna Kumar
Update: 2025-09-07 10:36 GMT
వైసీపీ మాజీ నేత ,మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరమయినా కేంద్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తున్నారు. తన ట్విట్టర్ పోస్ట్ లతో తన దృష్టికి వచ్చిన సమస్యలను అందరికీ తెలియపరుస్తూ , సలహాలు సూచనలు ఇస్తున్నారు.ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పలు అంశాలపై కేంద్రానికి సూచనలు చేస్తూ విజయసాయిరెడ్డి పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా గుండె జబ్బులపై సాయిరెడ్డి ఓ పోస్టు పెట్టారు.
భారతదేశంలో, ప్రతి మూడు మరణాలలో ఒకటి గుండె జబ్బుల వల్ల సంభవిస్తుందని సాయిరెడ్డి తెలిపారు. రిజిస్ట్రార్ జనరల్ తాజా నివేదిక ప్రకారం, మొత్తం మరణాలలో 56.7% నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు సంభవిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితి దేశ ఆరోగ్య వ్యవస్థకు తీవ్రమైన హెచ్చరికగా పనిచేస్తుందన్నారు. మనం సమిష్టిగా ఈ సవాలును ఎదుర్కోవాలని కోరారు.దేశవ్యాప్తంగా గుండె జబ్బుల నివారణకు సమగ్ర అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాలని ,దానిని జాతీయ ప్రాధాన్యతా అంశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి కోరారు.
రాజకీయాలకు దూరంగా వున్నాను కానీ ,ప్రజలకు ,సమస్యలకు దూరం కాలేదని చెప్పదల్చుకున్నారో ఏమో సాయిరెడ్డి అన్నింటిమీద పోస్ట్ ల వార్ మాత్రం కంటిన్యూ చేస్తున్నారు.ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ఈ పోస్ట్ ,సూచనలకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి మరి.