‘యోగాధ్యాయన పరిషత్’ పునరుద్దరణ

యోగాతో అద్భుత ఫలితాలు.. అవసరం లేకున్నా సిజేరియన్లు సరికాదు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి.;

Update: 2025-07-23 15:28 GMT

‘గతంలో ఉన్న యోగాధ్యయన పరిషత్తును పునరుద్దరించి దీని కోసం ఓ సొసైటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ పనితీరు.. టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు. యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. నేచురోపతి, హోమియో, ఆయుర్వేదం, యూనాని వంటి సంప్రదాయ వైద్య పద్దతులను యాక్టివేట్ చేయాలన్నారు.

యోగధ్యాయన పరిషత్ కోసం అవసరమైన సిబ్బందిని మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియమించుకోవాలని, యోగాధ్యాయన పరిషత్ ఏర్పాటు చేయడమే కాకుండా.. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో అవసరం ఉన్నా.. లేకున్నా.. సిజేరియన్ల ద్వారా కాన్పులు చేస్తున్నారు. యోగా చేస్తే ఎలాంటి ఆపరేషన్లు లేకుండానే సాధారణ ప్రసవాలకు అవకాశం ఉంటుంది. ఆఫ్ లైన్, ఆన్ లైన్ల ద్వారా యోగా శిక్షణ ఇచ్చేలా చూడాలి. యోగా, ధ్యానం వంటివి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యేలా చూడాలి. యోగా డే రోజున డిక్లరేషన్ ప్రకటించాం. ప్రకటనలతో సరిపెట్టకుండా.. ఆచరణలో పెట్టాలి.’ అని సీఎం అధికారులతో అన్నారు.


విస్తృతంగా వైద్య పరీక్షలు

‘టాటా ట్రస్ట్-గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న డిజిటల్ నెర్వ్ సెంటర్లు ప్రజారోగ్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాయి. ఇప్పటికే కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా టాటా డిజిటల్ నెర్వ్ సెంటరును ప్రారంభించాం. వచ్చే ఏడాది జనవరిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది చివరికి ప్రారంభించబోతున్నాం. దీ

ని కోసం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ సెంటర్లను సమర్థవంతంగా నడపగలిగితే.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ వైద్య సేవలు అందించే లక్ష్యంతో డిజిటల్ నెర్వ్ సెంటర్లు పని చేస్తున్నాయి. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు ఎలా అందించవ్చనే అంశాలపై అధ్యయనం చేయండి.. అధికారును సీఎం ఆదేశించారు.

పిల్లల్లో పోషకాహార లోపాలు

‘చిన్న పిల్లల్లో పోషకాహర లోపాలను ముందుగానే గుర్తించేలా చూడాలి. దీని కోసం కేర్ అండ్ గ్రో పాలసీని సమర్థవంతంగా అమలు చేయాలి. చిన్నప్పుడే పిల్లల్లో లోపాలను గుర్తిస్తే వారు పెరిగి పెద్దవాళ్లయ్యాక ఇబ్బందులు ఉండవు. వైద్య రంగంలో టెక్నాలజీ వినియోగంపై ఇప్పటికే గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో పని చేస్తున్నాం. దీంతో పాటు.. ఐఐటీ చెన్నై వంటి వారి సేవలను కూడా ఉపయోగించుకోవాలి.

ఈ మేరకు నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ.. టెక్నాలజీ పరంగా ఆయా సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. అధికారులు కానీ.. వైద్య నిపుణులు కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ప్రజల హెల్త్ డేటా అందుబాటులో ఉంటే.. వారిని ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేయవచ్చని చెప్పారు. మెడికల్ కాలేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్శిటీల ఏర్పాటు చేసే అంశంపై దృష్టి సారించాలి.” అని చంద్రబాబు చెప్పారు.

150 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ డైరెక్టరేట్లో పోస్టులను భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎంను కోరారు. 723 పోస్టులకు గానూ.. కేవలం 143 మంది మాత్రమే ఉన్నారని మంత్రి చెప్పడంతో ముందుగా 150 పోస్టులను భర్తీ చేసేలా ప్రక్రియను చేపట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు చేసే అంశంపై ఉన్న సమస్యను పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ కు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, టాటా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News