టీటీడీకి ఊరట, ఆ పూజారికి షాక్

టీటీడీ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.;

Update: 2025-04-04 09:32 GMT
Tirumala Temple
టీటీడీ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. పాలనా పరమైన వ్యవహారాలలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumal Tirupati Devasthanam) పెద్ద ఊరట లభించినట్టయింది.
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తనను తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా బదిలీ చెయ్యాలంటూ పెద్దింటి కుటుంబానికి చెందిన శ్రీనివాస దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏప్రిల్ 4 శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సుదీర్ఘకాలంగా తాను తిరుపతిలోనే ఉంటున్నానని, తనను తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి మార్చాలని శ్రీనివాస దీక్షితులు పిటిషన్‌ వేశారు. దీన్ని న్యాయస్థానం కొట్టివేసింది. పరిపాలన పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఉద్యోగిగా టీటీడీ ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడ నిర్వర్తించాలని పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
బదిలీ హక్కేమీ కాదని పేర్కొన్నట్టు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఈ తీర్పు ఉద్యోగులు పదేపదే కోర్టుకు వెళ్లకుండా తోడ్పడవచ్చునని టీటీడీ భావిస్తోంది.
Tags:    

Similar News