ఎన్ హెచ్ 16 నుంచి మంగళగిరి ఎయిమ్స్ కు ర్యాంపు
మంగళగిరి ఎయిమ్స్ కు వెళ్లేందుకు జాతీయ రహదారి నుంచి ఎంట్రీ ర్యాంపును ఎగ్జిట్ ర్యాంపుగా నిర్మించేందుకు కేంద్రం ఆదేశాలు.;
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన విజ్ఞప్తి మేరకు, మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు మెరుగైన ప్రవేశ మార్గం కోసం ర్యాంపు నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజాగా జరిగిన సమావేశంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి ఎయిమ్స్కు వెళ్ళే రోడ్డు మార్గంలో ప్రస్తుతం ఉన్న అసౌకర్యాలను నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు. ఎయిమ్స్కు నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు, సందర్శకులు, సిబ్బంది వస్తుంటారని, సరైన ర్యాంపు లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు, ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని ఆయన నొక్కి చెప్పారు. దీనివల్ల రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడంలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు.
డాక్టర్ పెమ్మసాని విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన నితిన్ గడ్కరీ, తక్షణమే ర్యాంపు నిర్మాణానికి సంబంధించిన పనులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ర్యాంపు నిర్మాణం పూర్తయితే మంగళగిరి ఎయిమ్స్కు వెళ్లే వారికి, ముఖ్యంగా అంబులెన్స్లకు రాకపోకలు సులభతరం అవుతాయి. ఇది ఎయిమ్స్కు వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుందని, వైద్య సేవలను మరింత వేగవంతం చేస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ ట్విటర్ లో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తక్షణ ఆమోదం పట్ల డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాంపు నిర్మాణం మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.