చంద్రబాబు టీమ్-24 బయోడేటా

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-06-12 12:05 GMT

రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన 24 మంది మంత్రులు, వారి రాజకీయ జీవిత విశేషాలు.

కొణిదెల పవన్‌ కల్యాణ్‌ (జనసేన), పిఠాపురం (కాకినాడ జిల్లా)
1996లో సినీ జీవితంలోకి పవన్‌ కళ్యాణ్‌ అడుగు పెట్టారు. పవర్‌ స్టార్‌ ఇమేజ్‌తో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (సీఎంపీఎఫ్‌) ట్రస్ట్‌ ద్వారా సేవలందించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనంతో బయటకు వచ్చి 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పట్లో బిజెపి, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయన్ను కలుసుకొని బయటకు వచ్చిన పవన్‌ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు.
నారా లోకేశ్, మంగళగిరి (గుంటూరు జిల్లా)
చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్‌ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2023 జనవరిలో యువగళం పాదయాత్ర చేపట్టారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 91వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.
కింజరాపు అచ్చెన్నాయుడు , టెక్కలి (శ్రీకాకుళం జిల్లా)
1995లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన అచ్చెన్నాయుడు 1999, 2004 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో టెక్కలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అదే సీటు నుంచి గెలుపొంది ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్టీ అధికారం కోల్పోవడంతో శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో 34వేల పైచీలుకు ఓట్లతో గెలుపొందారు.
కొల్లు రవీంద్ర, మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ డివిజన్‌ అధ్యక్షుడిగా, 2007లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 నుంచి కొల్లు ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు, అన్న క్యాంటీన్ల ద్వారా అన్నదానం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో చంద్రబాబు హయాంలో ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలై తాజాగా మచిలీపట్నం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు.
నాదెండ్ల మనోహర్‌ (జనసేన) , తెనాలి (గుంటూరు జిల్లా)
2004లో తెనాలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి విజయం సాధించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2011లో శాసనసభ స్పీకర్‌గా ఎన్నికై 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి 50వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా మొదటిసారి అవకాశం దక్కించుకున్నారు.
డాక్టర్‌ పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ (నెల్లూరు జిల్లా)
తెలుగుదేశం పార్టీలో చేరి సర్వే విభాగానికి పనిచేశారు. క్రమంగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చంద్రబాబు హయాంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, అర్బన్‌ హౌసింగ్‌ శాఖల మంత్రిగా చేశారు. నెల్లూరు నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 13 వందల మంది నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా విద్య నందిస్తున్నారు.
అనిత వంగలపూడి, పాయకరావుపేట (విశాఖపట్నం)
ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఓటమి పాలైన తర్వాత ఏపీ తెలుగుదేవం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మరోసారి గెలుపొంది మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
నిమ్మల రామానాయుడు, పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా)
రామానాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ నిమ్మల 17వేల మెజార్టీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో 70 శాతం ఓటింగ్‌ సాధించారు.
పయ్యావుల కేశవ్, ఉరవకొండ (అనంతపురం)
1994లో ఎన్టీఆర్‌ పిలుపుతో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా పని చేశారు. 2015 నుంచి 2019 వరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పని చేశారు. 2024లో ఐదోసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలిని తట్టుకొని ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నా, ఇప్పటివరకూ మంత్రిగా అవకాశం రాలేదు. మొదటి సారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు.
గుమ్మిడి సంధ్యారాణి, సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా)
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సంధ్యారాణి.. తొలుత ఉపాధ్యాయురాలిగా పని చేశారు. తండ్రి జన్ని ముత్యాలు స్ఫూర్తితో పాతికేళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో కాంగ్రెస్‌ తరఫున సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. 2015లో తెలుగుదేశం పార్టీ నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. 2020లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈసారి సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరపై గెలిచారు.
అనగాని సత్యప్రసాద్, రేపల్లె (బాపట్ల జిల్లా)
2009లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకట రమణ చేతిలో ఓడిపోయారు. 2014, 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి మోపిదేవిని ఓడించారు. తాజా ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు.
డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కొండపి (ప్రకాశం జిల్లా)
కొండపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యునిగా పనిచేసిన వీరాంజనేయ స్వామి దామచర్ల ఆంజనేయులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తొలిసారి కొండపి స్థానం నుంచి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. 2014–19 మధ్య టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశారు. 2019–24 వరకు తెలుగుదేశం శాసన సభాపక్షానికి విప్‌గా వ్యవహరించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు.
గొట్టిపాటి రవికుమార్, అద్దంకి (బాపట్ల జిల్లా)
గ్రానైట్‌ వ్యాపారి అయిన గొట్టిపాటి రవికుమార్‌ 2004లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో మార్టూరు రద్దవ్వడంతో అద్దంకికి మారి అక్కడి నుంచి విజయం సాధించారు. 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2016లో తెలుగుదేశం పార్టీలో చేరి 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కడంతో తొలిసారి మంత్రి అయ్యారు.
కందుల దుర్గేశ్‌ (జనసేన), నిడదవోలు
కాంగ్రెస్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దుర్గేశ్‌ వివిధ హోదాల్లో పనిచేసి ఎమ్మెల్సీ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌ సభ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2018 ఆగస్టు 30న జనసేనలో చేరిన దుర్గేశ్‌ 2019 శాససనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో నిడదవోలు నుంచి నెగ్గి మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
బీసీ జనార్దనరెడ్డి, బనగానపల్లి (నంద్యాల జిల్లా)
2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఓటమిపాలైన ఆయన తాజా ఎన్నికల్లో బనగానపల్లి నుంచి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
టీజీ భరత్, కర్నూలు (కర్నూలు జిల్లా)
తండ్రి టీజీ వెంకటేశ్‌ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన భరత్‌ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్నారు. తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఎస్‌ సవిత, పెనుకొండ (శ్రీసత్యసాయి జిల్లా)
సవిత తండ్రి ఎస్‌ రామచంద్రారెడ్డి ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సవిత 2024 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. 33 వేల మెజార్టీతో విజయం సాధించారు. 2017–19 వరకు రాష్ట్ర కురుబ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. పెనుకొండ పట్టణంలో కొన్నేళ్లుగా అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తూ రూ.5 భోజనం అందిస్తున్నారు. రాష్ట్రంలో కురుబ సామాజిక వర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వాసంశెట్టి సుభాష్, రామచంద్రాపురం
శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన సుభాష్‌ తాత సత్తిరాజు, తండ్రి సత్యం చెరి రెండు సార్లు అమలాపురం మున్సిపల్‌ కౌన్సిలర్లుగా పనిచేశారు. తల్లి కృష్ణకుమారి ప్రస్తుతం కౌన్సిలర్‌. ఎస్‌ఏఎఫ్‌ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాల ద్వారా శెట్టిబలిజ సామాజికవర్గంలో సుభాష్‌ పట్టు సాధించారు.2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో వైఎస్సార్‌సీపీలో పనిచేశారు.
కొండపల్లి శ్రీనివాస్, గజపతినగరం (విజయనగరం జిల్లా)
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నర్సయ్యపై 24,302 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఎన్‌ఎండీ ఫరూక్, నంద్యాల (నంద్యాల జిల్లా )
1981లో నంద్యాల మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985లో తొలిసారి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది అప్పట్లో చక్కెర పరిశ్రమ మంత్రిగా పనిచేశారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, మున్సిపల్‌ శాఖ, విద్యాశాఖ, ఉర్దూ అకాడమీ మంత్రిగా పనిచేశారు. 2017లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017–18లో శాసనమండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018–19 మధ్య ఆరోగ్యశాఖ, మైనార్టీ శాఖల మంత్రిగా వ్యవహరించారు.
ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా)
1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1984లో రాష్ట్ర క్రీడామండలి చైర్మన్‌గా నియమితులయ్యారు. 1985లో రాపూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు. 1989 రాపూరు నుంచి ఓడిపోయి.. 1990లో ఏపీ వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి 1999లో, 2004లోనూ రాపూరు నుంచి వరుసగా గెలుపొందారు. రాష్ట్ర సమాచార టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మున్సిపల్‌ మంత్రిగా వ్యవహరించారు. మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ పనిచేశారు.
మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, రాయచోటి (అన్నమయ్య జిల్లా)
సమైక్యాంధ్ర పార్టీ తరఫున రాంప్రసాద్‌ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 డిసెంబర్‌లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గట్టి పట్టున్న రాయచోటిలో 2495 ఓట్ల మెజార్టీతో గడికోట శ్రీకాంత్‌ రెడ్డిని ఓడించారు.
కొలుసు పార్థసారథి, నూజివీడు (ఏలూరు జిల్లా)
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి కొలుసు పెద్దారెడ్డయ్య మచిలీపట్నం లోక్‌సభ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో తొలుత ఉయ్యూరు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2019లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరి నూజివీడు నుంచి గెలుపొందారు.
సత్యకుమార్‌ యాదవ్‌ (బిజెపి), ధర్మవరం
మదనపల్లిలో చదువుకుంటున్న సమయంలో ఏబీవీపీ తరఫున కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వద్ద కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. సత్యకుమార్‌ సేవలను గుర్తించిన బిజెపి 2018లో జాతీయ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జిగా, అండమాన్‌ నికోబార్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.
Tags:    

Similar News