జూన్ 5న కోటి మొక్కల ప్లాంటేషన్
రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు,;
By : The Federal
Update: 2025-06-02 12:50 GMT
ఈ నెల 5న ఏపీలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, మంత్రులు, ప్రజా ప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలని కావాలని, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని అన్నారు. ప్లాంటేషన్పైన సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో గతేడాది 29 శాతం వరకు గ్రీన్ కవర్ ఉందని, ఈ ఏడాదికి 30.5 శాతానికి పెరిగిందని అన్నారు. ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంతంతో సహా రాష్ట్రంలో పచ్చదనం 2033 నాటికి 37 శాతానికి, 2047కి 50 శాతానికి చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. ప్రతి ఏడాది కనీసం 1.5 శాతం మేర గ్రీన్ కవర్ పెరగాలన్నారు. సీఆర్డీఏ పరిధిలో ఫారెస్ట్తో కలిపి ఎంత గ్రీన్ కవర్ ఉందో స్పష్టమైన సమాచారం శాటిలైట్ల సాయంతో సేకరించాలని, అలాగే ప్రతీ ప్లాంట్ను ట్యాగ్ చేయాలన్నారు. రాష్ట్రం ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఉండాలని, మొక్కలు నాటి వదిలేయడం కాకుండా వాటిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు అవసరమైతే సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకువస్తే వారికి అవకాశం కల్పించే విధానం తీసుకురావాలని సూచించారు. అమరావతి పరిధిలోని అన్ని రిజర్వ్ అటవీ ప్రాంతాలను మియావకీ తరహాలో పచ్చదనం పెంచి, 3 ఏళ్లలో ఫలితాలు కనబడాలన్నారు.