ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం ప్రణాళికలు రూపొందించాలి
ప్రణాళికా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;
By : The Federal
Update: 2025-06-17 15:51 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేందుకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్డీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి పలు అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతానికంటే ఈ సారి ఎక్కువగా ప్రణాళిక శాఖకు ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక శాఖే బాధ్యత తీసుకోవాలన్నారు. వనరుల సమీకరణలో రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక శాఖ పని చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన ప్రామాణిక సమాచారాన్ని రూపొందించుకోవాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 25 కెబినెట్ సమావేశాలు, 6 ఎస్ఐబీపీ సమావేశాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు.
2024–25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం లెక్కల్లో జాతీయ స్థాయికి మించి ఏపీ పురోగతిని సాధించిందని సీఎం అన్నారు. జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 8.7 శాతం మేర పెరిగితే.. ఏపీ 11.89 శాతం మేర పురోగతి నమోదు చేసిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన డేటా అనలిటిక్స్ కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర, జిల్లా, మండలాలతో పాటు గ్రామ స్థాయిలో కూడా కీ–పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే.. క్షేత్ర స్థాయి నుంచి పోటీతత్వం పెరుగుతుందన్నారు. 2028–29 నాటికి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు.
నెలవారీ అభివృద్ధి సూచికల ద్వారా ఎప్పటికప్పుడు పనితీరును సమీక్షించుకునే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు సూచించారు. దీని వల్ల ఎప్పుడైనా లోటుపాట్లు ఉంటే తక్షణం సవరించుకునే అవకాశం ఉంటుందన్నారు. రిజర్వాయర్లు, నేలలో తేమ శాతం, భూగర్బ జలాల వివరాలు వంటివి నమోదు చేసి వివరాలు తీసుకునే బాధ్యతను ప్రణాళిక శాఖ తీసుకోవాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటల్లో గ్రాస్ వాల్యూ ఎడిషన్ తో పాటు సేవల రంగంలో పెట్టుబడులు పెరిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాన్ని పరిశీలించాలన్నారు. బంగారు కుటుంబాలు–మార్గదర్శుల మధ్య సమన్వయం చేసుకునే ప్రక్రియను ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ సేవలు, విభాగాల పనితీరు మీద నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి చేరేలా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, క్యూఆర్ కోడ్ విధానాల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న అభిప్రాయ సేకరణతోపాటు.. మరిన్ని భిన్నమైన మార్గాల ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సహా ప్రణాళిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.