ఉప ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకొన్న పీడీఎఫ్
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికల్లో పీడీఎఫ్ తిరుగులేని శక్తిగా నిలుస్తోంది.;
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ పట్టు నిలుపుకుంది. రెండో సారి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఎన్నికల్లో యుటీఎఫ్ బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గురుమూర్తికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు భారీ మెజారిటీతో పట్టం గట్టారు. గతంలో ఇదే స్థానం నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా గెలుపొందిన షేక్ సాబ్జీ ఏలూరు అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని భీమవరం వస్తుండగా 2023 డిసెంబరు 15న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ సమీపంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురికావడం, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటీఎఫ్) ఉద్యమానికి తీరని లోటును మిగిల్చింది. సాబ్జీ పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉంది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింద.