ఎంతైనా సినిమా స్టార్ కదా..సిల్వర్ స్క్రీన్పై పవన్ ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెరైటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. థియేటర్ వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా తన ముఖాముఖని నిర్వహించారు.;
By : Vijayakumar Garika
Update: 2025-05-22 07:09 GMT
సజహంగా సమీక్షలు, అవి అధికారులతో చేసినవైనా కానీ, పార్టీ శ్రేణులతో నిర్వహించినవైనా కానీ అక్కడ ఉన్న స్కీన్ల మీద ప్రదర్శించడం చేస్తుంటారు. ఆ స్క్రీన్లు కూడా అంత పెద్దగా ఏమీ ఉండవు. కానీ సినిమా థియేటర్లో ఉన్న స్క్రీన్పైన కనిపించే విధంగా వీడియో కాన్ఫెరెన్స్లు కానీ టెలీ కాన్ఫెరెన్స్లు కానీ ఇంత వరకు ఎవ్వరూ చేయలేదు. సమీక్షలు నిర్వహించడంలో సాటిలేని మేటిగా పేరుపొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇంత వరకు అలాంటి ఆలోచనలు చేయలేదు. ఒక సినిమా మాదిరిగా అధికారులను కానీ, పార్టీ శ్రేణులను కానీ, ప్రజలను కానీ సినిమా థియేటర్లోని బిగ్ స్క్రీన్పైన కనిపిస్తూ ఎన్నడు రివ్వూలు నిర్వహించలేదు.
కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోలేదు. సినిమా థియేటర్లోని బిగ్ స్క్రీన్మీద కనిపిస్తూ ముఖాముఖి నిర్వహించి ఔరా అనిపించారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో పవన్ కళ్యాణ్ బహుశా ఈ ఆలోచనకు తెరతీసి ఉంటారు. సినిమా స్క్రీన్ మీద నటించడమే కాకుండా ముఖాముఖిలు కూడా నిర్వహించొచ్చని చూపించారు.
స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ఈ వినూత్న ప్రోగ్రామ్కు తెరతీసారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సినిమా స్క్రీన్ మీద స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మన ‘ఊరు–మాటా మంతి’ పేరుతో శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం రావివలస గ్రామస్థుల సమస్యల మీద ముఖాముఖి నిర్వహించారు. రావివలస గ్రామస్థులను టెక్కిలి భవానీ సినిమా థియేటర్కు పిలిపించి అందరితో పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద మాట్లాడారు. పంచాయతీరాజ్, గ్రామాణీభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యల పరిష్కారం అటుంచితే పవన్ కళ్యాణ్తో మాట్లాడినందుకు ఆ పల్లె వాసులు తెగ మురిసి పోయారు.