అసద్ తీపి పలుకులు..లోకేష్ పై ప్రేమా? చంద్రబాబు పై ద్వేషమా?

లోకేష్ కు ప్రాధాన్యత పెంచాలన్న అంశంలో తెలుగుదేశం పార్టీలో నుంచే అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది.;

Update: 2025-06-17 09:24 GMT
రాజకీయాలలో ప్రత్యర్ధులను విమర్శించడం, టార్గెట్ చేయడం సహజమే. అందులో ఎవరి రూట్ వారిదే.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మాత్రం తన రూటే సపరేట్ అంటున్నారు. చంద్రబాబు ను టార్గెట్ చేయడానికి ఆయన కుమారుడు లోకేష్ నే ఎంచుకున్నారు అసద్. లోకేష్ భుజాలపైనే తుపాకీ వుంచి చంద్రబాబు ను టార్గెట్ చేయాలన్న అసద్ వ్యూహం తెలుగు రాజకీయాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది. అదీకాక అసద్ వ్యాఖ్యలు వైసీపీ కి అనుకూలంగా వుండటంతో ఈ మాటల వెనుక పక్కా రాజకీయ వ్యూహం కనిపిస్తోంది.
అసలు అసదుద్దీన్ ఏమన్నాడు?
చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, అది సరిపోతుందని, ఇకనైనా తప్పుకుని లోకేష్‌కు నాయకత్వం అప్పగించాలని ఒవైసీ సూచించారు. చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీకి లోకేష్ వారసుడు అవుతాడని, జూనియర్ ఎన్టీఆర్ కాదని పేర్కొంటూ, టీడీపీలో ఉన్న వారసత్వ రాజకీయాలపై ఒవైసీ ఎత్తిపొడిచారు. లోకేష్‌ను గందరగోళానికి గురిచేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
ఒవైసీ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం
చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఒవైసీ మాట్లాడటం వెనుక రాజకీయ వ్యూహం కూడా కనిపిస్తోంది. లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించమని చెప్పడం ద్వారా టీడీపీలో ఇప్పటికే సాగుతున్న అంతర్గత చర్చను మరింత పెంచడం కూడా ఒక లక్ష్యం. దాంతో చంద్రబాబు పై పార్టీ పరంగానే మరింత ఒత్తిడికి గురిచేయవచ్చు.టీడీపీలో ఏదైనా జరిగితే అది ప్రతిపక్షం వైసీపీకి అనుకూలంగా మారుతుంది. గతం నుంచి జగన్ తో ఒవైసీకి స్నేహ బంధం వుంది కాబట్టి కావాలనే టీడీపీ అంతర్గత వ్యవహారమైన లోకేష్ అంశాన్ని ఒవైసీ మరోసారి తెరపైకి తెచ్చారంటున్నారు.ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం వుంది.జనసేన అధినేత పవన్ ఉప ముఖ్యమంత్రిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడికి అధిక ప్రాధాన్యం ఇస్తే అటు పవన్ కు వున్న ప్రాధాన్యత తగ్గుతుంది.దాంతో కూటమిలో విభేదాలు పరోక్షంగా వైసీపీకి అనుకూలంగా మారతాయి.ఈ నేపధ్యంలోనే లోకేష్ కు మద్దతుగా అసద్ మాట్లాడిన మాటలు లోకేష్ పై పాలుపోసినట్లా , నీళ్లు పోసినట్లా అన్న సందేహానికి దారితీసింది. తన ప్రసంగంలో అసద్ జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడం ,ఆయనకు ఇంత ఫాలోయింగ్ వుందా అంటూ తనకే తెలవదన్నట్లు వ్యాఖ్యానించడం కూడా ప్లాన్ ప్రకారమే జరిగినట్లుగా భావిస్తున్నారు.మొత్తంగా అసదుద్దీన్ ఒవైసీ చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలు రాజకీయంగా వ్యూహాత్మకమైనవి.
చంద్రబాబును అసద్ ఎందుకు టార్గెట్ చేశారు?
చంద్రబాబు నాయకత్వం లోని తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ని ఎన్డీఏకు ప్రధాన మద్దతుదారుగా వుంది.ప్రధాని మోదీ , బీజేపీ వైఖరిని పూర్తిగా బలపరుస్తూనే చంద్రబాబు కార్యాచరణ కొనసాగుతోంది.ప్రధానంగా ఇటీవల కాలంలో కీలకమైన వక్ఫ్ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడం వెనుక తెలుగుదేశం మద్దతే కీలకంగా మారింది.వక్ఫ్ బిల్లును సమర్థించిన చంద్రబాబు వైఖరిపై ఎంఐఎం గుర్రుగా వుంది.అందుకే చంద్రబాబుపై విమర్శలకు ఒవైసీ మరింత పదును పెట్టారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు, గత వైరుధ్యాలు దృష్టిలో పెట్టుకొని టీడీపీని, చంద్రబాబును బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.వక్ఫ్ (సవరణ) బిల్లు ముస్లింల హక్కులను ఉల్లంఘిస్తుందని, దేశ లౌకికవాదాన్ని బలహీనపరుస్తుందని ఒవైసీ ఆరోపించారు.1999లో తనపై జరిగిన పోలీస్ దాడి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని 2018లో ఒవైసీ ఆరోపించారు. అలాగే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినప్పుడు కూడా ఒవైసీ విమర్శలు గుప్పించారు.బీజేపీతో పొత్తు కారణంగానే చంద్రబాబు డబుల్ స్టాండర్డ్స్ ప్రదర్శిస్తున్నారని ఒవైసీ విమర్శించారు.తిరుమల తిరుపతి దేవస్థానం లో అన్య మతస్థులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న అంశాన్ని కూడా ఒవైసీ ప్రస్తావించారు.
లోకేష్ అంశంలో చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి
లోకేష్ కు ప్రాధాన్యత పెంచాలన్న అంశంలో తెలుగుదేశం పార్టీలో నుంచే అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల జరిగిన పార్టీ మహానాడులో కూడా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుల నుంచి ,పలువురు సీనియర్ నేతలు కూడా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని ,ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బాహాటంగానే తీర్మానం ప్రవేశపెట్టారు.పార్టీ లోపలా బయటా లోకేష్ నాయకత్వంపై పెద్ద చర్చసాగుతూనే వుంది. చంద్రబాబు ఎదుటే లోకేష్ పై చర్చలు జరుగుతున్నాఆయన మాత్రం మిన్నకుండి వున్నారు. అయితే లోకేష్ నాయకత్వంపై పార్టీ నేతలతో పాటు ,ప్రజలకూ నమ్మకం వుందని మాత్రం చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నియమావళి ప్రకారం నిర్ణయం వుంటుందని పలుసార్లు దాటవేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుండటం ,ఉప ముఖ్యమంత్రిగా పవన్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడం వల్లే లోకేష్ విషయంలో చంద్రబాబు తొందర పడటం లేదన్న అభిప్రాయం కనిపిస్తోంది.అయితే లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయక పోయినా , కనీసం వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని అందరూ కోరుతున్నారు. ఇదే సరియైన సమయంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించడంలో జరిగిన జాప్యం, కేసీఆర్ ఆనాడు కుమారుడి విషయంలో వ్యవహరించిన వైఖరి వల్లే పార్టీ నష్ట పోయిందన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
రాజకీయ వ్యూహమూ ,చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని అన్నారో గానీ లోకేష్ ను ఉద్దేశించి అసదుద్దీన్ మాట్లాడిన మాటలు మాత్రం రాజకీయ చర్చకు దారితీశాయి.అసద్ మాటలు నిజమే కదా అని తెలుగుదేశం శ్రేణులలోనే చర్చ సాగితే అది పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీస్తుంది.తనకు కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో తన తండ్రి అభిప్రాయంపై లోకేష్ మాత్రం సంతృప్తిగానే వున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కూడా పార్టీ పరంగా లోకేష్ కీలక భూమికనే పోషిస్తున్నారు.
Tags:    

Similar News