ఆన్లైన్ వద్దు..మాన్యువలే ముద్దు
ఒక వైపు టీచర్లు..మరో వైపు పోలీసులతో విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా టీచర్లు డీఈవో కార్యాలయం ముందు భైఠాయించారు.;
విశాఖపట్నంలో ఉపాధ్యాయులు కథం తొక్కారు, డీఈవో కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని నినదించారు. ఆన్లైన్ బదిలీ విధానంపై తీవ్రంగా వ్యతిరేకించారు. దీని వల్ల ఎస్జీటీలకు తీవ్ర అన్యాయంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా కాకుండా మాన్యువల్ పద్ధతిలో ఎస్జీటీల బదిలీలను చేపట్టాలని నినదించారు. ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారానే ఎస్జీటీల బదిలీ చేపట్టాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు.
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి వచ్చారు. మహిళా టీచర్లు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. డీఈవో కార్యాలయం ముందు భైఠాయించారు. ఎస్జీటీలకు ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా బదిలీలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకుండా ఆన్లైన్ పద్ధతిలోనే ట్రాన్సఫర్లు చేసేందుకు రంగం సిద్ధం చేయడాన్ని ఉపాధ్యాయులు తప్పుబట్టారు. కౌన్సిలింగ్ జరిగిన ఎంఈవో కార్యాలయాల ఎదుట శనివారం నిరసనలకు దిగిన ఉపాధ్యాయులు, ఆదివారం కూడా డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఆ మేరకు ఆదివారం విశాఖలో ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారనే సమాచారంతో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున డీఈవో కార్యాలయం వద్ద మోహరింపచేశారు. ఒక పక్క పోలీసులు మరో పక్కవ ఉపాధ్యాయుల నిరసనలతో డీఈవో కార్యాలయం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.