కన్నీళ్లు మిగిల్చిన కొత్త జంట
నెల క్రితమే పెళ్లైంది. అలా తిరిగొద్దామని ద్విచక్ర వాహనం మీద బయలు దేరారు. ఇరు కుటుంబాల్లో శోకం మిగిల్చారు.;
By : The Federal
Update: 2025-06-16 06:11 GMT
ఇద్దరూ ల్యాబ్ టెక్నీషియన్లు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహమై నెలైనా కాలేదు. కాళ్లకు పారాణి కూడా ఆరలేదు. ఎన్నో ఆశలతో కుటుంబ జీవితంలోకి ప్రవేశించిన ఆ జంట ఆ ఆశలు నెరవేర్చుకోకుండానే విగత జీవులుగా మారారు. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో బతకాల్సిన భార్యాభర్తలు పెళ్లైన నెల రోజుల్లోనే ఓ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. అందరికీ కన్నీళ్లు తెప్పించే అత్యంత బాధాకరమైన ఈ దుర్ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
జొన్నాడ సాయిది కాకినాడ జిల్లా పిఠాపురం. శాలినిది విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలంలోని గంగవరం గ్రామం. ఇద్దరూ వైద్య పరీక్షలు చేసే వృత్తిలో ఉన్నారు. గాజువాకలోని యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. సాయికి 27 సంవత్సరాలు కాగా, శాలినికి 25 ఏళు. ఇద్దరూ మేజర్లే కాబట్టి పెళ్లి చేసుకుందామనుకున్నారు. తమ పెళ్లికి ఇరు కుటుంబాల్లో పెద్దలను ఒప్పించాలనుకున్నారు. దాని కోసం ఇద్దరూ కష్టపడ్డారు. రెండు వైపుల కుటంబాల పెద్దలను తమ పెళ్లికి ఒప్పించారు. అలా ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో సాయి, శాలినీలు నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. కొత్తగా కాపురం పెట్టారు. వారు పని చేసే ఆసుపత్రికి దగ్గరలోని శ్రీహరిపురంలోనే ఒక ఇల్లును అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. నెల రోజులు సరదాగా వారి సంసారం సాగింది.
ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఆసుపత్రిలో డ్యూటీలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సెలవు కావడంతో సరదాగా షికారు చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రకారం ద్విచక్ర వాహనంపై కొత్త జంట సరదా షికారుకు బయలుదేరింది. అలా ములగాడ మీదుగా విశాఖ నగరంలో పోర్టు రోడ్డులోని మారుతీ సర్కిల్ వద్దకు రాగానే వారి వెనుకనే వస్తున్న ఒక ట్రెయిల్ ట్రక్ పొట్టన పెట్టుకుంది. మృత్యువు రూపంలో వారి వెనకనే వస్తూ కొత్త జంట ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి.. సాయి, శాలినీలను ఈడ్చుకుంటూ పోయింది. ఈ దుర్ఘటనలో బండి నడుపుతున్న సాయి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయాలపాలైన శాలినీ షీలానగర్లోకి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడకు తీసుకెళ్లి చికిత్స మొదలు పెట్టే సమయానికి శాలినీ కూడా ప్రాణాలు విడిచింది. ఈ దుర్ఘటన సాయి, శాలినీ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. నెల రోజుల కిందే అందరం కలిసి సంతోషంగా వీరి ప్రేమ వివాహం చేశామని, కాళ్లకు పారాణి ఆరక ముందే కానరాని లోకాలకు వెళ్లి పోయారని గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులను సైతం ఈ దృశ్యం కంటతడి పెట్టించింది.