టీటీడీ లడ్డూ ప్రసాదంపై నవీన్కుమార్వి అసత్య ఆరోపణలు
ప్రజలను, భక్తులను గందరగోళానికి గురి చేసే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.;
By : The Federal
Update: 2025-06-13 13:41 GMT
తెలంగాణకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తిపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంపై తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ మేరకు శుక్రవారం టీటీడీ ఒక ప్రకటనను విడుదల చేసింది.
జూన్ 8న, స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు తనకు నోటిలో గాయమైందని సదరు వ్యక్తి టీడీపీ మీద ఆరోపణలు చేశారు. దీనిపై వెంటనే టీటీడీ స్పందించింది. ఆరోపణలు చేసిన నవీన్ కుమార్ అనే భక్తుడిని అంబులెన్సు ద్వారా తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో తరలించారు. అక్కడ నవీన్ కుమార్కు వైద్య పరీక్షలు చేశారు. అంతేకాకుండా అతనిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలలో నవీన్ కుమార్ అనే వ్యక్తి టీటీడీ ప్రసాదం తినేటప్పుడు తన నాలుకను తానే కొరుక్కున్నాడని, దీంతో అతని నాలుక కింద భాగంలో కేవలం చిన్నపాటి గాయం అయినట్లు వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చాయని ఆ ప్రకటనలో టీటీడీ స్పష్టం చేసింది.
అయినప్పటికీ.. ఆ నవీన్ కుమార్ అనే వ్యక్తి టీటీడీ వద్ద నష్ట పరిహారం పొందాలనే దురుద్దేశంతో టీటీడీ లడ్డూ ప్రసాదంపై సోష్ల మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు టీటీడీ గుర్తించినట్లు ఆ ప్రకటనలో టీటీడీ స్పష్టం చేసింది. వైద్య పరీక్షల్లో తనకు తానుగా గాయరచుకున్నట్లు రిపోర్టులు వచ్చినా.. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేశారని, ఈ అసత్య ఆరోపణలు చేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను, భక్తులను గందరగోళపరిచేలా ఇలాంటి దురుద్దేశపూరిత చర్యకు పాల్పడిన సదరు వ్యక్తి నవీన్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ యంత్రాంగం ఆ ప్రకటనలో హెచ్చరించింది.