లిక్కర్ స్కాం కేసులో సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి

రెండు రోజులపాటు మిథున్ రెడ్డిని విచారించనున్న సిట్ అధికారులు

Update: 2025-09-19 07:41 GMT

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ కస్టడీలోకి తీసుకుంది. రెండు రోజుల పాటు ఆయన్ను సిట్ అధికారులు విచారించనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించడంతో, ఈ ఉదయం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలించారు.అంతకు ముంది ఈకేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, రెండు రోజులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మిథున్ రెడ్డిని విచారించనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కేసులో ఏకంగా 3,55 కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు సిట్ అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు.ఈ స్కాంలో మిథున్ రెడ్డిని ఏ4 నిందితుడిగా చేర్చిన సిట్, ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసింది. అయితే ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇదివరకే తిరస్కరించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాత్రం ఓటు వేసేందుకు కొన్ని రోజులు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. ఆ గడువు ముగిసిన వెంటనే మిథున్ రెడ్డి మళ్లీ సరెండర్ అయ్యారు.ఇప్పుడు మిథున్ రెడ్డిని సెట్ తమ కస్టడీకి తీసుకోవడంతో ఎలాంటి కీలక సమాచారం రాబడుతుందన్న చర్చ సాగుతోంది.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు, నగదు వివరాలపై సిట్ అధికారులతో ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.అంతేకాక కేసు తీవ్రత దృష్ట్యా ఈడీ అధికారులు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
Tags:    

Similar News