కనికరించని ఉగ్రవాదులు..బతిమలాడినా కాల్చి చంపేశారు

పహల్గాం ఉగ్రదాడిలో విశాఖ వాసి చంద్రమౌళి దుర్మరణం. విశాఖ వెళ్లి నివాళులు అర్పించిన చంద్రబాబు.;

Update: 2025-04-23 16:30 GMT
ఉగ్రవాదుల కాల్పులకు ముందు హోటల్‌ వద్ద చంద్రమౌళి దంపతులు మరో ఇద్దరు స్నేహితులతో మాటా మంతీ

వేసవి విహారం కోసం కశ్మీర్‌ వెళ్లిన విశాఖకు చెందిన జేఎస్‌ చంద్రమౌళి (70) పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దుర్మరణం పాలవడం విశాఖలో విషాదాన్ని నింపింది. శ్రీకాకుళానికి చెందిన చంద్రమౌళి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్నతోద్యోగిగా పనిచేసి పదేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం నగరంలోని పాండురంగాపురంలో నివాసం ఉంటూ విశాఖ పెన్షనర్స్‌ క్లబ్‌ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 18న మరో ఇద్దరు స్నేహితులు పీ అప్పన్న, ఆర్‌ శశిధర్‌ కుటుంబాలతో కలిసి చంద్రమౌళి తన భార్య నాగమణిని వెంటబెట్టుకుని ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా కశ్మీర్‌కు వెళ్లారు. శ్రీనగర్‌లో బస చేస్తూ ఉదయాన్నే ఎంపిక చేసుకున్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తున్నారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పహల్గాం చేరుకున్నారు. అక్కడ ఒక హోటల్‌ గది వాష్‌రూమ్‌లో ఉండగా కాల్పుల మోత విని బయటకు వచ్చారు చంద్రమౌళి. అవి ఉగ్రవాదుల కాల్పులుగా గుర్తించి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆయనతో ఉన్న మరో ఐదుగురు పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ చంద్రమౌళి çహృద్రోగి (కొన్నాళ్ల క్రితం ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ) కావడంతో వేగంగా పరిగెత్తలేకపోయి ఉగ్రవాదులకు చిక్కారు. తనను చంపొద్దని చంద్రమౌళి ఉగ్రవాదులను కాళ్లావేళ్లా పడ్డారు. తనను చంపవద్దని వేడుకున్నా కనికరించకుండా తుపాకీతో కాల్చి చంపారు. పహల్గాంలో కాల్పుల ఘటన విశాఖలో ఉంటున్న ఆయన బంధువులు తెలుసుకుని ఆందోళనతో వాకబు చేశారు. ఆయన కనిపించలేదని అక్కడ నుంచి సమాచారం రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం నాటికి చంద్రమౌళిని కాల్చి చంపారని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈనెల 18న బయల్దేరి వెళ్లిన చంద్రమౌళి దంపతులు 26న తిరిగి విశాఖ చేరుకోవలి ఉంది. ఇంతలోనే టెర్రరిస్టుల ఘాతుకానికి బలయ్యారుని ఆయన తోడల్లుడు కుమార్‌రాజా కన్నీరొలుకుతూ చెప్పారు.

కూతుళ్లను అమెరికా పంపి..
చంద్రమౌళికి నిహారికి, అనిమిషా అనే ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. కొన్నాళ్ల క్రితం విశాఖ వచ్చిన కుమార్తెను అమెరికా సాగనంపారు. తండ్రి మరణవార్త విని అమెరికాలో ఉన్న కుమార్తెలు గురువారం సాయంత్రానికి విశాఖ చేరుకుంటున్నారు. చంద్రమౌళి బావమరిది నాగేశ్వరరావు విశాఖ ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్నారు. మరో సోదరుడు భానోజీరావు కూడా విశాఖలోనే స్థిరపడ్డారు. చంద్రమౌళి బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
కశ్మీర్‌ వెళ్తున్నట్టు చెప్పలేదు..
తాము కశ్మీర్‌ పర్యటనకు వెళ్తున్నట్టు అపార్ట్‌మెంట్‌ వాసులకు గాని, స్నేహితులకు గాని చెప్పలేదు. తాము ఊరెళ్తున్నాం.. 26న వస్తాం.. అని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌కు చెప్పి వెళ్లారు. దీంతో ఆ దంపతులు తమ అత్తవారింటికి పార్వతీపురం వెళ్తున్నారని భావించారు. బుధవారం ఉదయానికి చంద్రమౌళి ఉగ్రవాదుల దాడిలో చనిపోయినట్టు తెలిసి హతాసులయ్యారు. చంద్రమౌళికి పెన్షనర్లలో మంచి పేరే ఉంది. ఆయనకు సేవా, దాన గుణం ఉందని, వృద్ధులు పేదలకు, విద్యాసంస్థలకు సాయం చేస్తుంటారని, ఎస్‌బీఐలో పనిచేసిన అక్కయ్యపాలేనికి చెందిన ఢిల్లీరావు, బాపిరాజు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు. అందరితో సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారని, స్నేహపూర్వకంగా మసలుకుంటారని, అలాంటి మంచి వ్యక్తిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు విశాఖ రాక
చంద్రమౌళి భౌతికకాయాన్ని బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అంతకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో చంద్రమౌళి పార్థివదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం పాండురంగాపురంలో చంద్రమౌళి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కొవ్వొత్తులతో చంద్రమౌళికి నివాళి..
ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన చంద్రమౌళికి విశాఖలో ప్రజా, రాజకీయ పార్టీల నేతలు కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు. విజయవాడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో రాత్రి విశాఖ చేరుకుని విమానాశ్రయంలో కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు.
Tags:    

Similar News