రేపటి నుంచి మెగా డీఎస్సీ మెరిట్ జాబితాలు
వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ డీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.;
By : The Federal
Update: 2025-08-21 17:02 GMT
మెగా డీఎస్సీ –2025 మెరిట్ జాబితాలను ఈ నెల 22న శుక్రవారం విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేపట్టినట్టు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. తర్వాత టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వడం జరిగిందన్నారు. అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇవ్వడమైందన్నారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22 శుక్రవారం మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్సైటుతో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైటులో కూడా ఉంచనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుండి మాత్రమే సమాచారం పొందాలన్నారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తామన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు, 5 పాస్ పోర్టు సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు వెరిఫికేషనుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందన్నారు. వెరిఫికేషనుకు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలన్నారు. వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ డీఎస్సీ వెబ్సైటులో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా, అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని సూచించారు. ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైంది.
కాబట్టి అభ్యర్థులు కేవలం డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశారు. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైటు, జిల్లా విద్యాధికారి వెబ్సైట్ , క్యాండిడేట్ లాగిన్ నందు కానీ ప్రభుత్వం ద్వారా విడుదల చేసే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో సూచించారు.