ముగ్ధగా వెళ్లి.. ముద్దగా వచ్చి..!
అరుణ పతాకాల రెపరెపల నడుమ మావోయిస్టు నేత అరుణ అంత్యక్రియలు జరిగాయి. ప్రజాసంఘాలు, వామపక్ష, విప్లవ నాయకులు, అభ్యుదయవాదుల జోహర్ నినాదాలు మిన్నంటాయి.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-06-20 15:10 GMT
మూడు దశాబ్దాల కిందట పదహారేళ్ల ప్రాయంలో ముగ్ధగా అడవి బాట పట్టింది. ముప్ఫై ఏళ్ల తర్వాత ఆమె మాంసపు ముద్దగా ఆ ఇంటికి తిరిగొచ్చింది. ఆమె మావోయిస్టు నేత వెంకట రవి వర్మ చైతన్య అలియాస్ అరుణ. 1980 జనవరి 23న జన్మించిన ఆమెæముప్ఫై సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి మావోయిస్టు ఉద్యమంలో చేరి ఆ తర్వాత మళ్లీ ఇంటి ముఖం చూడలేదు. అయిన వారందరికీ దూరంగా.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడింది. ఎన్నో సార్లు పోలీసుల కాల్పుల నుంచి తప్పించుకుంది. అలా ఇన్నాళ్లూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
మావోయిస్టు దుస్తుల్లో గన్ చేతబట్టి ..
చివరకు బుధవారం వేకువజామున అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైంది. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఆమె స్వగ్రామం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలేనికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆమె పార్ధివదేహాన్ని ఇంటి వద్ద ఉంచారు. అరుణ మృతదేహాన్ని తీసుకొస్తున్నారని తెలిసి ప్రజా సంఘాలు, విప్లవాభిమానులు, వామపక్ష పార్టీల నాయకులు, రచయితలు, సంపాదకులు. గ్రామస్తులు.. ఇలా పలువురు అరుణ ఇంటికి చేరుకున్నారు. కన్నీరొలుకుతూ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీలు, పీడిత ప్రజల కోసం పోరాడి వారి అభిమానాన్ని చూరగొందని అరుణను వారంతా కొనియాడారు.
అరుణ పార్ధివదేహం వద్ద నినాదాలు చేస్తున్న అభిమానులు
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఐ ఎంల్ న్యూ డెమొక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్, విజయనగరం జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమల, ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, మహిళా చేతన అధ్యక్షురాలు కె.పద్మ, చైతన్య మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కె.లలిత, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రతినిధి కె.పద్మ, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీరామ్మూర్తి, వీక్షణం పత్రికా సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ తదితరులు అరుణ పోరాట పటిమను శ్లాఘించారు.
ఎన్కౌంటర్లో హతమయ్యాక
కేంద్ర ప్రభుత్వం కగార్ అపరేషన్తో మావోయిస్టులను హత్య చేస్తూ ఉద్యమాలను నిర్మూలించాలని చూస్తోందని దుయ్యబట్టారు. ప్రజల కష్టాలు, బాధలు ఉన్నంత వరకు విప్లవోద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మావోయిస్టుల హత్యలను తక్షణమే ఆపేసి శాంతి చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె పార్ధివదేహంపై అరుణ పతాకాన్ని ఉంచి నివాళులర్పించారు. జోహార్ కామ్రేడ్ అరుణ.. అంటూ నినాదాలు చేశారు.
మావోయిస్టు అరుణ అంతిమయాత్ర
ఘనంగా అరుణ అంతిమయాత్ర..
మావోయిస్టు అరుణకు విప్లవ సాంప్రదాయ ప్రకారం నివాళులర్పించాక గ్రామంలో ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు. ఎర్ర జెండాలను చేతబట్టి అరుణ అమర్ రహే.. జోహార్ అరుణక్క.. అంటూ నినాదాలు చేసుకుంటూ స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అనంతరం ఆమె చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.