అట్టహాసంగా ప్రారంభమైన కర్నూలు బాలోత్సవం

పిల్లల్లోని నైపుణ్యాలను వెలికితీయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు.;

By :  Admin
Update: 2025-02-06 13:35 GMT

పిల్లల పండుగ 4వ కర్నూలు బాలోత్సవం గురువారం నగర శివార్లలోని మాంటిస్సోరి ఇండస్‌ పాఠశాల వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా, బాలోత్సవం పతాకాన్ని బాలోత్సవం గౌరవాధ్యక్షులు, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య ఎగురవేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కళ్యాణమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. కర్నూలు బాలోత్సవం అధ్యక్షులు బడే సాహెబ్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభలో జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని నైపుణ్యాలను వెలికి తీయాలని సూచించారు. తాను కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు అమరావతి బాలోత్సవంలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. ప్రతి విద్యార్థీ చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూడాలన్నారు. తాను పాఠశాలల్లో మోనో యాక్షన్‌లో ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ డైలాగ్‌ చెప్పేవాడినని, అందుకే తన పేరు కూడా రంజిత్‌ గా మారిందని చెప్పారు. పిల్లలు వారిలోని నైపుణ్యం చూపడం వల్ల ఒక మంచి పేరు వస్తుందన్నారు. నైపుణ్యాలను వెలికితీయడం, పోటీ తత్వం పెంపొందించడానికి ఈ ఉత్సవాలు తోడ్పడతాయని తెలిపారు. సంస్కృతిని ముందు తరాలకు అందజేస్తే అది ఒక నాగరికతగా మారుతుందని, అందుకు ఇది ఒక వేదిక అవుతుందని అన్నారు.

అకడమిక్‌ పోటీలు పిల్లల్లోని సృజనాత్మకతను బయటకు తీస్తాయని, పోటీతత్వం ఏర్పడుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. డీఈవో శామ్యూల్‌ పాల్‌ మాట్లాడుతూ ఇది పిల్లలకు ఒక పండగని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు మంచి వేదికని చెప్పారు. విద్యార్థులోని సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, అందుకు నిర్వహణ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. విద్యతో పాటు అన్నీ కలిసి ఉన్నపుడే విద్యార్థి సమగ్రంగా అభివృద్ధి చెందుతాడని తెలిపారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని అనడానికి జిల్లా కలెక్టర్‌ ఒక ఉదాహరణ, ఆదర్శం అని చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు వెళ్లాలని, అవి బాల్యం నుంచే అలవర్చుకోవాలని తెలిపారు.
బాలోత్సవ కమిటీ రాష్ట్ర నాయకులు రామరాజు మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 30 పట్టణాల్లో బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మార్కులకే పరిమితం కావడం, ఇతర రంగాల్లో ప్రావీణ్యం లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. పోటీల ద్వారా పిల్లల్లో మానసిక పెరుగుదల ఉంటుందన్నారు. పిల్లలను ఆడనివ్వాలని, పాడనివ్వాలని, వాటిని ప్రోత్సహించడానికి బాలోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మండలంలోనూ బాలోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరారు. బాలోత్సవం గౌరవాధ్యక్షులు జి పుల్లయ్య మాట్లాడుతూ ఇలాంటి వేదికలను ఉపయోగించుకునే విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు వీలుంటుందని చెప్పారు. గెలవడం కన్నా పాల్గొనడమే ఒక విజయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మొదటి రోజు 22 రకాల సాంస్కృతిక, అకడమిక్‌ పోటీలు నిర్వహించారు. కల్యాణమ్మ వేదిక, గాదె సుబారెడ్డి వేదికల మీద శాస్త్రీయ నృత్యం, సంపద్రయ నృత్యం, వ్యాస రచన, చిత్ర లేఖనం, గీతాలాపన పోటీలు నిర్వహించారు. మొత్తంగా 57 పాఠశాలల నుండి 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. శుక్రవారం కూడా బాలోత్సవం కొనసానుంది.
జానపద నృత్యం, విచిత్ర వేషధారణ, ఏక పాత్రాభినయం, జానపద గీతాలాపన, కోలాటం పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ముగింపు సభ నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. బాలోత్సవం కమిటీ సభ్యులు ఎల్లా గౌడ్‌ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో క్లస్టర్‌ యూనివర్శిటీ డీన్‌ డాక్టర్‌ అక్తర్‌ భాను, ప్రైవేటు విద్యా సంస్థల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు పిబివి సుబ్బయ్య, కర్నూలు బాలోత్సవం కన్వీనర్‌ ధనుంజయ, ప్రధాన కార్యదర్శి జెఎన్‌ శేషయ్య, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్, సిఈఓ విల్సన్, ప్రిన్సిపల్‌ మీనాక్షి విల్సన్, ప్రయివేటు విద్యా సంస్థల సంఘం జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య, కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్‌ ఆంజనేయులు, ఎంఈవో శ్రీనివాసులు, ప్లానింగ్‌ కన్వీనర్‌ కెంగార మోహన్, కమిటీ సభ్యులు కె.సురేష్‌ కుమార్, జంద్యాల రఘుబాబు, యుఆర్‌ఎ రవి కుమార్, ఎస్‌ఎం జయరాజు, టి.నరసింహా, నవీన్‌ పాటి, హేమంత్‌ కుమార్, రంగస్వామి, రమాదేవి, సుధీర్‌ రాజు, ఖజా హుస్సేన్, చంద్ర మోహన్, మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News