కేశినేని నాని నాటి ఓటు టీడీపీని గెలిపించింది
కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంది.;
By : The Federal
Update: 2025-06-16 08:04 GMT
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారిన నేపథ్యంలో నాడు విజయవాడ ఎంపీగా కేశినేని నాని వేసిన ఓటు కొండపల్లి మున్సిపాలిటీ చరిత్రను మార్చేసింది. నాడు ఎంపీగా ఉన్న కేశినేని నాని ఓటు చెల్లుబాటు అవుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతులు జారీ చేసింది. కేశినేని నాని వేసిన నాడు వేసిన ఓటు వల్ల వైసీపీ కంటే అదనంగా ఒక ఓటు మెజారిటీ సాధించడంతో కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకోవడానికి మార్గం సుగమమైంది.
కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో వైసీపీ 14 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 14స్థానాలు గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థి ఒక సీటును గెలుచుకున్నారు. అయితే ఇండిపెండెంట్గా గెలిచిన శ్రీదేవి అనే కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ కౌన్సిలర్ల బలం 15కు పెరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగారు. నాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో సభ్యుడి కింద వైసీపీ ఓటు వేయడంతో వైసీపీ బలం కూడా 15కు పెరిగింది. దీంతో అటు వైసీపీ సంఖ్యా బలం ఇటు టీడీపీ బలం సమంగా మారింది.
ఈ నేపథ్యంలో నాడు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానిని టీడీపీ రంగంలోకి దింపింది. ఎక్స్ అఫియో సభ్యుడిగా కేశినేని నాని తన ఓటును టీడీపీకి వేయడంతో ఆ పార్టీ బలం 16కి పెరిగింది. దీంతో వైసీపీ కంటే టీడీపీకి ఒక ఓటు మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఎంపీ ఓటు చెల్లుబాటు కాదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి అది పెండింగ్లో ఉంది.
తాజాగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. నాడు 2021లో ఎంపీగా ఉన్న కేశినాని ఎక్స్ అఫియో ఓటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేస్తూ సీల్డ్ కవర్లో ఆదేశాలు జారీ చేసింది. నాడు నాని వేసిన ఓటుతో టీడీపీకి మెజారిటీ ఉందని, వైసీపీ బలం 15 ఉంటే..టీడీపీ బలం 16 ఉందని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టబాబును చైర్మన్గా ప్రిసైడింగ్ అధికారి కే చైతన్య ప్రకటించారు. వైస్ చైర్పర్సన్లుగా కరిమికొండ శ్రీలక్ష్మి, చుట్టకుదురు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రిసైడింగ్ అధికారి చైతన్య వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని మరో సారి హాట్ ఆఫ్ద టాపిక్ అయ్యారు.
నాడు టీడీపీకి ఓటు వేసిన నాటి ఎంపీ కేశినేని నాని 2024లకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయవాడ నుంచి రంగంలోకి దిగిన కేశినేని నాని, తన సోదరుడు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఓడిపోగా, టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.