కేసీఆర్, జగన్ నన్ను రాజకీయంగా పాతిపెట్టాలని చూశారు

ఆర్థికంగా, రాజకీయంగా నేను ఎదగ కూడదని కుట్రలు చేశారు;

Update: 2025-06-18 10:22 GMT
PCC AP Chief YS Sharmila

ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వం చేసింది. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఈ ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ వారిద్దరిపై ఆరోపణలు చేశారు.

నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరి వాళ్ళ ఫోన్లు లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది ముమ్మాటికి పచ్చి నిజం. ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేది. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవాళ్లు, వీళ్ల సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయిందని పీసీసీ అధ్యక్షురాలు ఆరోపించారు.

నాడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ద్వారా నా ఫోన్ ట్యాప్ అయినట్లు నాకు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అప్పుడు వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారు, నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారు. ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా.. అంటే అనుమానమే?, జగన్ తన సొంత మేనల్లుడు, మేన కోడలు అస్థి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించాడు. ఇలాంటి పరిస్థితిలో వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడని అనుకోనన్నారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా, ఏ విచారణను అయినా ఎదుర్కుంటా, బైబిల్ మీద ప్రమాణం చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నేను చెప్పగలను. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసి మీరు ఏం చేశారు అని నన్ను అడగొచ్చు, ఇది అక్రమం, అనైతికం కదా ఎందుకు అనలేకపోయారని మీరు అడగొచ్చు, స్వయంగా మీ ఇంట్లో మీరు వింటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగొచ్చు, ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు జగన్, కేసీఆర్ చేసిన అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నదన్నారు. నేను జగన్ కి తోడబుట్టిన చెల్లెలు, ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర పన్ని నా భవిష్యత్ ను పాతిపెట్టాలని ఎన్నో చేశారన్నారు.

ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కుట్ర, నాకు సపోర్ట్ చేసిన వాళ్లను బెదిరించారు. రాజకీయంగా నా వాళ్ళను రానివ్వకుండా చేశారు. నా అనుచరులను భయబ్రాంతులకు గురి చేశారు. నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారన్నారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఏ సంబంధం లేదు, కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశాడు, నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశాడని చెప్పారు. నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశా, నా ప్రతి పోరాటానికి అడ్డు పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం. ముమ్మాటికి నిజం, అనాడు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవు, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అధికారంలో ఉన్నారు... అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎక్కడకు పిలిస్తే అక్కడకు వస్తా

నేను కేసు పెట్టాలి అనుకుంటే అప్పుడే పెట్టే దాన్ని, నాకు పర్సనల్ గజ్ అంటూ ఏమి లేదు. నా మీద జగన్ కేసు వేసినప్పుడే నేను కేసు వేసే దాన్ని, అమ్మకు ఇచ్చిన ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడే నేను కేసు వేసే దాన్ని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని కోరారు.

Tags:    

Similar News