ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గేదెల
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.;
By : The Federal
Update: 2025-08-04 07:31 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల చేత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు.
హైకోర్టు మొదటి కోర్టు హాల్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ పి.సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి, పలువురు ఇతర రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.