లోకేష్ ను కలిసిన అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి
తెలుగు బిడ్డగా రాష్ట్రానికి గర్వకారణమని అభినందించిన లోకేష్;
By : The Federal
Update: 2025-06-26 03:51 GMT
భవిష్యత్ లో ప్రభుత్వ పరంగా అన్నివిధాల ప్రోత్సహిస్తామని హామీ
ఉండవల్లిః అమెరికా ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి నేటి సాయంత్రం శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా జాహ్నవి ఘనత సాధించారు. 2029లో ఆమె తన మొదటి అంతరిక్ష యాత్రలో పాల్గొననుంది. స్పేస్ మిషన్ కు వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన జాహ్నవిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అభినందించారు. తెలుగుబిడ్డగా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఈ క్రమంలో జాహ్నవి ప్రయాణాన్ని అడిగి తెలుసుకున్నారు. జాహ్నవి సాధించినది మైలురాయిగా నిలుస్తుందన్నారు. భవిష్యత్ లో ప్రభుత్వ పరంగా అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ చేపట్టే స్టెమ్ అవుట్ రీచ్ యాక్టివిటీలో ప్రభుత్వం తరపున భాగస్వామి కావాలని కోరారు.