మెడికల్ కాలేజీల పీపీపీ పై జగన్ 'యుద్ధభేరీ'

పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా 9న జగన్ టూర్

Update: 2025-10-03 09:31 GMT
మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ లోకి తీసుకువెళ్లడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యమం ప్రారంభించారు. ఉత్తరాంధ్ర నుంచే తన 'పోరాటాన్ని' మొదలుపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈనెల 9న అనకాపల్లిలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ(Narsipatnam Medical College)ని సందర్శించి వాస్తవాలను ప్రజలకు వివరిస్తారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు.. జగన్ పర్యటనను ప్రకటించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు ఏమన్నారంటే..

‘వైఎస్‌ జగన్ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజిల నిర్మాణం ఒక చరిత్ర. కానీ, విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. తన అనుచరులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. తద్వారా జగన్‌కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’ అన్నారు.
చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారని, కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలని, ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుందని అన్నారు. "మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు. అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవడం లేదు. కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు" అని అన్నారు.
మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. "వైఎస్‌ జగన్ అధికారంలోకి రాకముందు 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీను వైఎస్ జగన్ సందర్శిస్తారు" అని వివరించారు.
"పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు. మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లును దూరం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే మెడికల్ కాలేజిల ఐదు వేల కోట్లు ఖర్చు మీద పెట్టలేరా. విద్యా వైద్యంతోపాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రవేటిపరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది’’ అని అమర్నాథ్‌ అన్నారు.
సుదీర్ఘ కాలం తర్వాత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారు. ఇది కేవలం ఒక రోజు పర్యటన. అయితే ఈ పర్యటనకు పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తారా లేక మెడికల్ కళాశాల పరిశీలనకు కేవలం ఓ వందో రెండు వందల మందినో అనుమతిస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు.
పోలీసు అనుమతి ఉన్నా లేకున్నా జగన్ పర్యటన ఉంటుందని మాత్రం వైసీపీ నాయకులు చెబుతున్నారు.
Tags:    

Similar News