గెలిచింది కూటమికాదు... ప్రజలు!

సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్‌ ప్రసంగించారు.;

Update: 2025-06-23 16:23 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచి అంబేడ్కర్‌ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన సుపరిపాలన – తొలిఅడుగు కార్యక్రమంలో లోకేష్‌ మాట్లాడుతూ... అందరూ కూటమి గెలిచింది, టిడిపి గెలిచింది, జనసేన గెలిచింది, బిజేపి గెలిచింది అంటున్నారని కానీ గెలిచింది కూటమి కాదు, గెలిచింది ప్రజలు అని, ఇది ప్రజా విజయమని అన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు చెడ్డవారు అయితే చెడ్డ ఫలితాలే వస్తాయని అంబేడ్కర్‌ అన్నారని, గత ఐదేళ్లు విధ్వంస పాలనే జరిగిందన్నారు. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు.. ఉన్న కంపెనీలు తరిమేసారని మండిపడ్డారు.

దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం పెట్టుబడులు పెట్టం అని ఒక పెద్ద కంపెనీ అధినేత ప్రకటించారని, ఆరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి అదో ఉదాహరణని లోకేష్‌ పేర్కొన్నారు. అయిదేళ్లలో ఒక్క రోడ్డు వెయ్యలేదని.. కనీసం రోడ్డు పై గుంతలు పూడ్చలేదని, ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టలేదని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో రూ. 700 కోట్లతో రాయల్‌ ప్యాలస్‌ కట్టుకున్నారే తప్ప రైల్వే జోన్, విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.

దళిత బిడ్డల్ని చంపి డోర్‌ డెలివరీ చేసారని, మాస్క్‌ అడిగినందుకు దళిత డాక్టర్‌ సుధాకర్‌ ను వేటాడి, వెంటాడి చంపేసారని. అక్క ను వేధించిన వారిని ప్రశ్నించినందుకు బిసి బిడ్డ అమర్నాధ్‌ గౌడ్‌ పై పెట్రోల్‌ పోసి తగలబెట్టి చంపేశారని లోకేష్‌ విమర్శలు గుప్పించారు. అయితే సుపరిపాలన లో కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చిందన్నారు. ప్రజల మొఖంలో చిరునవ్వు వచ్చిందన్నారు. ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు వచ్చిందన్నారు.
జగన్‌ తన ఐదేళ్లలో సాధించలేనిది కూటమి ఏడాదిలో సాధించామన్నారు. ఇంకా చెయ్యాల్సింది ఎంతో ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రూ. 4 వేల పెన్షన్‌ ఇవ్వడం లేదన్నారు. దివ్యాంగులకు 6 వేలు, పూర్తిగా బెడ్‌ కే పరిమితం అయితే 15 వేలు ఇస్తున్నామని, 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేశామని, రూ. 8745 కోట్లు తల్లుల ఖాతాల్లో వేశామన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఆగష్టు 15న మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అమలుచేస్తామని మంత్రి లోకేష్‌ వెల్లడించారు. పేదరికం లేని సమాజం కోసం పీ4 కాన్‌సెప్ట్‌ను తీసుకొచ్చామని, సమాజానికి తిరిగి ఇవ్వడమే పీ4 పథకమన్నారు. బంగారు కుటుంబాలకు చేయూత అందిస్తున్న మార్గదర్శులకు ధన్యవాదాలు తెలిపారు.
విద్యా శాఖలో సంస్కరణలు తెస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విద్య వ్యవస్థ ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మధ్యాహ్న భోజన పధకానికి డొక్కా సీతమ్మ పేరు, స్టూడెంట్‌ కిట్‌కి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరు పెట్టామన్నారు. కేజీ నుండి పీజీ వరకూ కరికులం మారుస్తున్నామన్నారు. బ్యాగ్‌ బరువు తగ్గించడానికి సెమిస్టర్‌ వైస్‌ డివైడ్‌ చేసి పుస్తకాలు సిద్ధం చేశామన్నారు. మహిళల్ని గౌరవించాలి అని విద్యార్థి దశ నుండే నేర్పిస్తున్నామన్నారు. దేవుడు కూడా అన్ని సమస్యలు తీర్చలేడు. ఉద్యోగస్తులు తలుచుకుంటే స్వర్ణాంధ్ర ఖచ్చితంగా సాధ్యం అవుతుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలర్‌ ఎగరేసి తిరగడం కాదు, ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని మంత్రి లోకేష్‌ అన్నారు. 
Tags:    

Similar News