‘యోగా’నంద సాగరం
అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంది;
విశాఖ యోగానంద సాగరమైంది. లక్షలాది మంది యోగాసనాలతో విశాఖ తీరం కిక్కిరిసిపోయింది. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన జన సందడిని చూసి భానుడి లేలేత కిరణాలు వెదజల్లుతుండగా కడలి కూడా మురిసిపోయింది. విశాఖ ఖ్యాతి చిరకాలం నిలిచేలా రెండు గిన్నిస్ బుక్ రికార్డులను కూడా సొంతం చేసుకుంది. పదకొండవ అంతర్జాతీయ దినోత్సవ వేడుకకు శనివారం ఉదయం విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. ఇందుకు నగరంలోని ఆర్కే బీచ్ వేదికైంది. ప్రదాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ యోగా డే కార్యక్రమాన్ని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 30 కి.మీల మేర యోగాసనాలు నిర్వహించారు. ఈ మొత్తం దూరంలో 326 కంపార్టుమెంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్టుమెంటులో వెయ్యి మంది యోగాసనాలు చేసేందుకు వీలు కల్పించారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేకువజామునే యోగాభ్యాసకులను బస్సులు, ఇతర వాహనాల్లో నిర్దేశిత ప్రాంతాలకు, అక్కడ నుంచి కంపార్టుమెంట్లకు తీసుకొచ్చారు. చాలా చోట్ల కంపార్టుమెంట్లు నిండిపోవడంతో కొందరు ఆ పక్కనే యోగాసనాలు చేయగా మరికొందరు వెనుదిరిగి వెళ్లిపోయారు. బీచ్ రోడ్డుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోనూ యోగా డేలో భాగంగా పెద్ద సంఖ్యలో యోగాసనాలు చేశారు.
బీచ్ రోడ్డులో యోగాసనాలు
ఆరున్నరకే వేదిక వద్దకు ప్రధాని..
ఆర్కే బీచ్లో యోగా డే వేడుక ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. రాత్రి బస చేసిన తూర్పు నావికాదళ గెస్ట్ హౌస్ నుంచి ఉదయం ఆరున్నర గంటలకే ప్రధాని మోదీ వేదిక వద్దకు చేరుకున్నారు. తొలుత ఆయుష్ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్, ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాలుగు నిమిషాలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు నిమిషాల సేపు మాట్లాడారు. అనంతరం ప్రధాని 19 నిమిషాలు ప్రసంగించారు. 7.10 గంటలకు ప్రధాని ప్రసంగం ముగిశాక యోగాసనాలను ప్రారంభించారు. ప్రధానమంత్రి తాను ప్రత్యేక స్థలంలో కాకుండా జనం మధ్యలోకి వెళ్లి వారితో కలిసి యోగాసనాలు చేశారు. ఆయన బాటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు కూడా అనుసరించారు. 45 నిమిషాల పాటు శిక్షకుడి సూచనలతో వివిధ భంగిమల్లో యోగాసనాలు చేశారు. అదే సమయంలో వేదికకు సమీపంలోనే 11 యుద్ద« నౌకల్లో పదకొండు వేల మంది నావికులు కూడా సమాంతరంగా యోగా విన్యాసాలు కొనసాగించారు. ఎనిమిది గంటలకు యోగాసనాలు పూర్తయ్యాక కార్యక్రమాన్ని ముగించారు.
రెండు గిన్నిస్ రికార్డులు సొంతం..
విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు రెండు గిన్నిస్ బుక్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదనంలో 22,120 మంది గిరిజన విద్యార్థినీ, విద్యార్థులతో ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డులకు ఎక్కారు. శనివారం ఉదయం విశాఖ సాగరతీరంలో 3.20 లక్షల మందికి పైగా ఒకేసారి ఒకేచోట యోగాసనాలు చేసి మరో గిన్నిస్ రికార్డు సాధించింది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు సాంకేతిక సాయంతో హాజరైన యోగాభ్యాసకులను లెక్కించి గిన్నిస్ రికార్డును ప్రకటించారు. గుజరాత్లోని సూరత్లో 2023లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగాసనాలే ఇప్పటివరకు ఉన్న గిన్నిస్ రికార్డు. ఇప్పుడు విశాఖలో 3.20 లక్షల మందికి పైగా యోగాసనాలు చేయడంతో సరికొత్త సృష్టించినట్టయింది. దీంతో నెల రోజులుగా సాగుతున్న యోగాంధ్ర మహా యజ్ఞం పూర్తయింది.
తీరంలో బాలిక యోగ విన్యాసాలు
ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం..
విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ప్రకటన వెలువడినప్పట్నుంచి ప్రభుత్వ యంత్రాంగం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లా యంత్రాంగమంతా యోగా డే పనులే సర్వస్వంగా భావించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, కొంతమంది మంత్రులు కూడా ఇక్కడే తిష్టవేసి యోగా డే పనులను పర్యవేక్షించారు. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి వచ్చి సమీక్షించారు. విశాఖ చరిత్రలోనే ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. పైగా యోగా డేకి ప్రధానమంత్రి హాజరవుతుండడంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ యోగా డే కోసం పది వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
యుద్ధ నౌకలో యోగాసనాలు చేస్తున్న నావికులు
రెండు వేల సీసీ కెమెరాలను ఏర్పాటు కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి యోగాసనాల కోసం జనాన్ని తీసుకు రావడానికి దాదాపు పదివేల బస్సులు, ఇతర వాహనాలను వినియోగించారు. నాలుగు రోజులు ముందు నుంచే యోగాసనాలు నిర్వహించే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కి.మీల ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అటువైపు జనాన్ని రాకుండా కట్టడి చేశారు. మొత్తమ్మీద ఈ భారీ యోగా డేకి ఎలాంటి అపశృతులు, అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అటు ప్రభుత్వం, ఇటు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. యోగా డే విజయంతమైనందుకు అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.