గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు నమోదు లక్ష్యంగా విశాఖపట్నంలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ యోగాసనాల్లో ఐదు లక్షల మంది పాల్గొనేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్ను ఇందుకు వేదికగా ఎంపిక చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ యోగా వేడుకలు విజయవంతానికి జిల్లా యంత్రాంగం గత కొన్ని రోజులుగా తలమునకలై ఉంది. ప్రతి రోజూ యోగాకు సంబంధించిన కార్యక్రమాలు, నమూనా యోగాసనాలు, రిహార్సల్స్ చేయిస్తున్నారు. ఇందులో విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, ఉపా«ధ్యాయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇంకా మరెందరో పాలుపంచుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విశాఖ జిల్లా యంత్రాంగమంతా ఈ యోగా ఈవెంట్ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు.
యోగాసనాల్లో పాల్గొన్న కలెక్టర్ హరేందిరప్రసాద్
ఆర్కే బీచ్ టు భీమిలి..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర యోగాసనాలు చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి వీలుగా ఐదు లక్షల మందిని యోగాసనాల్లో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం విశాఖ జిల్లాలోని పదకొండ మండలాల పరిధిలో ఉన్న గ్రామ, వార్డు స్థాయిల్లో యోగా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ట్రైనింగ్ సెంటర్లో వంద చొప్పున మూడు సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నారు. జూనియర్ విభాగంలో 10–18 సంవత్సరాల బాలబాలికలు, యంగ్ గ్రూపు విభాగంలో 19–35 వయసున్న యువతీ యువకులు, సీనియర్ల విభాగంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులతో యోగాసన పోటీలు నిర్వహించారు. వీరికి వివిధ ఆసనాలు, పాటలు, పెయింటింగ్, స్కిట్లు, రోల్ప్లే, క్విజ్, పోస్టర్ ప్రిపరేషన్, స్లోగన్ల తయారు చేయడం, వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారిని జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు మండల స్థాయిలో యోగా పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ పోటీలను ఆయా కేంద్రాల్లో యోగా గురువులుగా వ్యవహరిస్తున్న వారు పర్యవేక్షిస్తరారు. మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి జిల్లా స్థాయిలో జూన్ 9 నుంచి 14 వరకు యోగా పోటీలు నిర్వహిస్తారు. ఇక జిల్లా స్థాయిలో వివిధ కేటగిరిల్లో మొదటి స్థానం పొందిన మహిళలు, పురుషులకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేస్తారు. విశాఖలో 21న జరిగే మెగా యోగాసనాలకు వచ్చే వారికి రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
యోగాసనాలు చేస్తున్న ప్రజలు
తొట్లకొండ బౌద్ధారామంలో..
యోగాసనాల వేడుకల్లో భాగంగా ఆదివారం విశాఖలోని ప్రముఖ బౌద్ధ పర్యాటక కేంద్రం తొట్లకొండపై జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ నేతృత్వంలో వెయ్యి మందితో యోగాసనాలు నిర్వహించారు. ఇందులో కలెక్టర్తో పాటు బౌద్ధ గురువులు రాజధమ్మ (మయన్మార్), బర్కరే (కాంబోడియా), విశాఖపట్నం బౌద్ధ సంఘం సభ్యులు ధర్మచారి తదితరులు ప్రార్థనలు చేసి యోగాసనాలను ప్రారంభించారు.
బౌద్ధారామం ఎదుట బాలిక యోగా విన్యాసం