'గ్రీన్ అండ్ బ్లూ' సిటీగా అమరావతి
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 49వ సీఆర్డిఏ అథారిటీ సమావేశం జరిగింది.;
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. శుక్రవారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు అంశాల మీద చర్చించారు. రాజధాని అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల్లో రూ. 1,052 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలనే పనుల కోసం టెండర్లు పిలవాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీంతో పాటుగా అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారి–16కి కలిపేందుకు రూ. 682 కోట్లతో చేపట్టే నిర్మాణ పనుల కోసం కూడా టెండర్లు పిలవాలనే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపైన మంత్రి నారాయణతో పాటు అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. దీనికి సంబంధించిన నిపుణులతో చర్చలు జరిపినట్లు మంత్రి నారాయణ, సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇటీవల వారు చేపట్టిన ఉత్తరప్రదేశ్ పర్యటన వివరాలను మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుకు వివరించారు. లక్నోలో రివర్ బండ్ ఎలా నిర్మించారు, అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల పనితీరు ఎలా ఉన్నాయనే దానిపైన అధ్యయనం చేసినట్లు సీఎంకు మంత్రి నారాయణ వివరించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధ్యయనం చేసేందుకు యుపీ అధికారులు ఏపీకి రానున్నట్లు సీఎంకు మంత్రి నారాయణ వివరించారు.