భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి
వర్షాలపై సీఎస్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;
భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సోమవారం సచివాలయంలో సమీక్షించారు. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సిఎస్కు సూచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండప్రాంతాలు కోతలకు గురికావడంతో అధికారులు ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు సమాచారం అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని... అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు. ముందస్తు సన్నద్దతతో, అప్రమత్తతో ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా చూడాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.