సీఆర్డీఏ ప్రధాన పరిపాలన కార్యాలయం ప్రారంభంతో రాజధాని అమరావతి అభివృద్ధి యాత్ర ఆరంభమైందని, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీ+7 విధానంలో నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని సోమవారం ఉదయం 9.55 గంటలకు సీఎం చంద్రబాబు రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన ఆ భవనాన్ని పరిశీలించారు. సీఆర్డీయే, ఏడీసీఎల్తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం భవన నిర్మాణాలు చేపట్టింది. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారు. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారు. రాజధాని విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం లేనిపోని పంచాయితీ పెట్టింది. రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని అమరావతిలో ఏర్పాటు చేశాం. రాజధాని నిర్మాణానికి భూమి కావాలి... ప్రణాళికలకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమానపడ్డారు.
సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించాం. భూమి కోసం ఎదురుచూస్తున్న సమయంలో అమరావతి రైతులు నాకు దారి చూపారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చాం. సమీకరణ విధానాన్ని విజయవంతం చేసిన చరిత్ర అమరావతి రైతులదే. ప్రపంచంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ విధానం లేదు...మనమే ఈ విధానాన్ని తెచ్చాం... సక్సెస్ చేశాం. అమరావతి పనుల రీ-స్టార్ట్ తర్వాత మొదటిగా సీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభమైంది.. నాకు సంతోషంగా ఉంది. సీఆర్డీఏ భవన ప్రారంభం రాజధాని అభివృద్ధి యాత్రకు ఆరంభం.”అని ముఖ్యమంత్రి వివరించారు.
రాజధాని పోరాటంలో జోలె పట్టాను
“రాజధాని కోసం అమరావతి మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారు...గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. రైతుల ఉద్యమానికి మద్ధతుగా నేను కూడా జోలె పట్టాను...ఉద్యమానికి అండగా నిలిచాను. కష్టాలు మరిచిపోవద్దు... రైతులు చేసిన త్యాగాల ఫలితాలను రైతులే అనుభవించాలి.. నేను దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఫేజ్-1లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చారు. భూములిచ్చినందుకు గత పాలకులు మిమ్మల్ని నానా హింసలు పెట్టారు. రాజధాని ఎడారి అన్నారు... వేశ్యల రాజధాని అన్నారు. ఎంతో అపహాస్యం చేశారు. రైతులకు రెట్టింపు గౌరవం దక్కేలా... రెట్టింపు ఫలాలు అనుభవించేలా చేస్తాం.
అమరావతి ఓ మునిసిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరం. అమరావతి పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటుంది. రైతులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారoభం కావాలి. అమరావతి అభివృద్ధికి ఆటంకాలు లేవు. అమరావతిని క్వాంటం వ్యాలీ చేస్తున్నాం... విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. ఒకప్పుడు ఐటీ.. ఇప్పుడు క్వాంటం, డేటా సెంటర్, ఏఐ వంటి టెక్నో రంగాలదే హవా. అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటాం... చేయూతనిస్తాం. రాజధాని అమరావతి పునాదులు చాలా బలంగా ఉన్నాయి. దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి మట్టి, జలాలు తెచ్చి శంకుస్థాపన చేశాం. రాజధాని అభివృద్ధి కోసం ప్రతి రోజూ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తాను. అమరావతి రైతులను మరిచేదే లేదు. త్వరలో భూములిచ్చిన రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతా. అందరం కలిసి రాజధానిని అభివృద్ధి చేసుకుందాం.” అని సీఎం చెప్పారు.
రాజధాని రైతుల సమస్యల పరిష్కార బాధ్యత ఆ ముగ్గురిదే
“రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తాం. రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకోవాలి. రైతులతో నిరంతరం మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యతను ఈ ముగ్గురు తీసుకుంటారు. అప్పటికీ ఇంకా పరిష్కారం కాని సమస్యలేమైనా ఉంటే నేను బాధ్యత తీసుకుంటాన అని మాటిచ్చారు.
హైటెక్ సిటీ నిర్మాణం మొదలు పెట్టే నాటికి అక్కడ ఎకరం రూ.లక్ష ఉండేది...ఇప్పుడు రూ.177 కోట్లకు చేరింది. అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నాం... విమర్శలు చేసే వారంతా ఈ విషయాన్ని గమనించాలి. ఒకసారి జరిగిన తప్పుకు రైతులతో పాటు రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. పవన్ కళ్యాణ్, బీజేపీలతో కలిసి ముందుకెళ్తున్నాం. విశాఖ కూడా అద్భుతంగా అభివృద్ధి అవుతోంది. దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వస్తోంది. నా ఆలోచన ఎప్పుడూ ప్రజల కోసమే... వారి భవిష్యత్ కోసమే’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.