నాకు ఛాలెంజ్‌లంటే ఇష్టం

పట్టుదలతో పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్‌ సూచించారు.;

Update: 2025-06-23 12:12 GMT

తనకు ఛాలెంజ్‌లు అంటే చాలా ఇష్టమని, వాటిని స్వీకరించి, పట్టుదలతో పని చేసి వాటిల్లో గెలవడం చాలా ఇష్టమని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. బాగాబాగా చదువుకోవాలి.. పట్టుదలతో రాణించాలి.. బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్థాపించిన డాక్టర్‌ డీవీఆర్‌ సైనిక్‌ స్కూల్‌ను లోకేష్‌ సోమవారం ప్రారంభించారు. సైనిక్‌ స్కూల్‌ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్, సైన్స్‌ ల్యాబ్, బాలబాలికల హాస్టల్, క్యాంటీన్, మెస్‌ భవనాలను డీవీఆర్‌ సైనిక్‌ స్కూల్‌ సెక్రటరీ, కరస్పాండెంట్‌ హితేష్‌ చెంచురామ్‌తో కలిసి మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్‌ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు.

అనంతరం లోకేష్‌ మాట్లాడుతూ.. నేను పదో తరగతి వరకు భారతీయ విద్యాభవన్‌ లో చదివాను. ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంటర్‌ లిటిల్‌ ఫ్లవర్‌ లో చదివినప్పుడు ఆనాడు ఉన్న అధ్యాపకులు కానివ్వండి.. మా గురువుగా ఉన్న ప్రొఫెసర్‌ రాజ్‌ రెడ్డి గారు కానివ్వండి..ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అందుకే గురువులను దేవుడితో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ లోకేష్‌ పేర్కొన్నారు. మన తల్లులను గౌరవించాలి, ఇల్లు దాటే ముందు వారి ఆశీర్వాదం తీసుకోవాలి అంటూ విద్యార్థులకు నీతి సూక్తులు వల్లించారు.

మన తల్లుల త్యాగల వల్ల మనం చదువుకోగలుగుతున్నాం. వారి త్యాగాల వల్ల మనం ఈ రోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనం తల్లులను గౌరవించాలన్నారు. పేదరికం నుంచి బయటకు రావాలంటే విద్య ఒక్క మార్గమన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి∙దగ్గుబాటి చెంచురామయ్య విద్య శక్తి తెలుసుకుని 1980ల్లోనే అద్భుతమైన విద్యాసంస్థలను ఏర్పాటుచేశారని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్య అందించాలనే లక్ష్యంతో దగ్గుబాటి కుటుంబం పనిచేస్తోందన్నారు. ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రజలకు సేవలందించారు. ఈనాడు పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ రోజు సైనిక్‌ స్కూల్‌ ను ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ స్కూల్‌కు సహాయం అందించడంలో అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు,

మన సైనికులు మనకోసం నిలబడుతున్నారు. మనకోసం పోరాడుతూ జవాన్‌ మురళీనాయక్‌ చనిపోయారు. మురళీ నాయక్‌ తల్లిదండ్రులను నేను పరామర్శించాను. ఆ కుటుంబానికి ఆయన ఒక్కరే బిడ్డ. ఆర్మీలోకి వద్దని తల్లిదండ్రులు చెప్పినా దేశానికి సేవ చేస్తానని వెళ్లాడు. ఒకవేళ చనిపోతే దేశం మొత్తం కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్‌. సైనికుల త్యాగాల వల్లే నేడు మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఇలాంటి అద్భుతమైన సైనికులను అందించేందుకే సైనిక్‌ స్కూల్‌ ను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు.

ఇక్కడ పిల్లలను చూస్తుంటే దేవాన్‌‡్ష గుర్తుకువస్తున్నాడు. దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు జయించే శక్తి కూడా ఇస్తాడు. ఒక్క ఎగ్జామ్‌ లో ఫెయిల్‌ అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవిత ప్రయాణంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనందరం రోడ్‌ లెస్‌ ట్రావెల్‌ ఎంచుకోవాలి. కష్టమైన మార్గమైనా ఎంచుకోవాలి. 40 ఏళ్లుగా గెలవని మంగళగిరిని ఎంచుకుని నేను పోటీచేశా. మొదటిసారి ఓడిపోయాను. రెండోసారి కసితో పనిచేసి రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీతో విజయం సాధించాను. నన్ను ఎంతో ఎగతాళి చేశారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశా. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలన్నారు.
విద్యాశాఖ చాలామంది వద్దన్నారు. ఛాలెంజ్‌ లు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఛాలెంజ్‌ లు స్వీకరిస్తా. ఏపీలో ప్రభుత్వ విద్య ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని చెప్పా. ఆ ప్రకారం విద్యాశాఖలో సంస్కరణలు తీసుకువచ్చాం. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాం. పిల్లలు ఛాలెంజ్‌ లను నవ్వుతూ స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, డాక్టర్‌ డీవీఆర్‌ సైనిక్‌ స్కూల్‌ సెక్రటరీ, కరస్పాండెంట్‌ హితేష్‌ చెంచురామ్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎంఎమ్‌ కొండయ్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళీ, బాపట్ల ఎస్పీ తుషార్‌ డూడీ తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News