మీ జాతాకాలు నా దగ్గరున్నాయి..ఒళ్లు దగ్గరపెట్టుకోండి

సీక్రెట్‌గా సర్వేలు చేయిస్తున్నానని, రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;

Update: 2025-06-29 07:52 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులకు ఫుల్‌ క్లాస్‌ పీకారు. ప్రజలు మనమీ ఉన్న నమ్మకాన్ని, ఆశలను వమ్ము చేయకూడదని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనులు చేయాలని, చేసిన పనులను వారి వద్దకు వెళ్లి తాము చేసినట్లు చెప్పుకోవాలని, కానీ చాలా మంది అలా చేయడం లేదని, వారి వల్ల ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తోందని, ఇది కరెక్ట్‌ కాదని, మారాలని, ఇదే పునరావృతమైతే చర్యలు తీసుకుంటానని ఫుల్‌ క్లాస్‌ పీకారు.

ప్రతి ఒక్కరి డేటా తన వద్ద ఉందని, క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు పనితీరుకు సంబంధించి వివరాలు తెప్పించుకుంటున్నానని, తేడాలొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇన్‌చార్జిలు, ఇతర నేతలతో సీఎం చంద్రబాబు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కొంత మంది పనితీరుపై అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రోజూ నలుగురు చొప్పున ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నానని.. వారి పని తీరుకు సంబంధించిన అంశాలపై ఆ సందర్భంలో వారికి చెప్పాల్సింది చెబుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేల పని తీరు మారాలన్నారు.

చెప్పిన విధంగా వారి పని తీరు మర్చుకుంటే అందరికీ బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులని.. వారికి భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు. ప్రజలు మన మీద ఉన్న నమ్మకంతో 94 శాతం స్ట్రైక్‌ రేటు ఇచ్చారని, రికార్డు స్థాయిలో మద్ధతు తెలిపారని, అలా ప్రజలు మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలన్నారు. వారి ఆశలకు అనుగుణంగా మనం పని చేయాల్సి ఉంటుందన్నారు. మనం చేస్తున్న పనులను వారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తుపైన కూడా వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు.

మన ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తోందని, వాటిని ప్రజలకు వివరించడంలోను, వారికి అర్థమయ్యే విధంగా చెప్పుకోలేకపోతున్నామని, ఇది మనకున్న లోపని, దీనిని అధికమించాలన్నారు. ఎంత పని చేశామనే అంశంతో పాటుగా ఆ పని ఎలా చేస్తున్నామనేది కూడా చాలా కీలకమని, కొందరు ఎంతో పని చేస్తారు కానీ, వారికి మంచి పేరు రాదన్నారు. మరి కొందరు పెద్దగా పని చేయకపోయినా వారికి ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నారు. మాకు రాజకీయ వారసత్వం ఉంది, మేము పని చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే అలాంటి వారికి ఒక నమస్కారం పెట్టి ఇంటికి పంపుతామన్నారు. వారసత్వాన్ని కాపాడుకుంటూ పని చేయాలని సూచించారు.

Tags:    

Similar News