లంచగొండి భార్యను పట్టించిన భర్త

తనింట్లో లంచం డబ్బులను భార్య ఎక్కడెక్కడ దాచిపెడుతుందనే విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

Update: 2024-10-09 08:05 GMT

లంచగొండి భార్యను భర్తే పట్టించిన వ్యవహారం ఇపుడు సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఇఇగా దివ్యజ్యోతి పనిచేస్తున్నారు. లంచం తీసుకునే విషయంలో చాలాకాలంగా భార్య-భర్తల మధ్య గొడవలవుతున్నాయి. లంచం తీసుకోవటం నేరం, పాపమని భర్త నెత్తి నోరుమొత్తుకుంటున్నా భార్య పట్టించుకోవటంలేదు. పైగా లంచం తీసుకోవద్దని చెప్పినపుడల్లా భర్తతో గొడవపడేది. దాంతో మండిపోయిన భర్త బుధవారం ఉదయం తనింట్లో లంచం డబ్బులను భార్య ఎక్కడెక్కడ దాచిపెడుతుందనే విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దాంతో ఇపుడా విషయం సంచలనంగా మారింది.

ఏడేళ్ళుగా లంచం తీసుకునే విషయంలో తమిద్దరి మధ్యా బాగా గొడవలవుతున్నట్లు ఆమె భర్త చెప్పారు. లంచం తీసుకోకుండా తన భార్య ఇంటికి వచ్చిన రోజు ఒక్కటి కూడా లేదని అన్నారు. మణికొండలో కాంట్రాక్టర్ల నుండి పెద్దఎత్తున తన భార్య లంచాలు తీసుకుంటున్నట్లు ఆ వీడియోలో చెప్పాడు. కమీషన్ల రూపంలో లంచాలు తీసుకుని ఆ డబ్బును ఇంటికి తెచ్చి తనకు తెలీకుండా రహస్యంగా దాచిపెడుతున్నట్లు చెప్పాడు. అయితే తనింట్లో తనకు తెలీని రహస్య ప్రదేశాలు ఏముంటాయని కూడా ప్రశ్నించాడు. అందుకనే బీరువాల్లో, వార్డురోబుల్లో చీరల మధ్యలోను, పేపర్ల మధ్యన, దేవుడి గదిలోను, దేవుడి పటాల వెనకాల, చివరకు చెప్పుల స్టాండుల్లో కూడా తన భార్య డబ్బులు దాచిపెట్టినట్లు వీడియోలు తీసి అప్ లోడ్ చేశాడు. మొత్తం రు. 80 లక్షలు దాచిపెట్టినట్లు చెప్పాడు భర్త.

లంచం తీసుకోవద్దని చెప్పినా వినకపోవటంతో భార్యతో చాలాసార్లు గొడవలైనట్లు భర్త చెప్పాడు. తాను గొడవపడినపుడల్లా తనపై అధికారులే లంచం తీసుకోమని తనను ప్రోత్సహిస్తున్నారని, వాళ్ళ ఒత్తిళ్ళకు తట్టుకోలేక లంచాలు తీసుకుంటున్నట్లు చెప్పిందని కూడా భర్త చెప్పాడు. జ్యోతిపైన అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావటంతో రెండు రోజుల క్రితమే ఆమె జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నట్లు కూడా భర్త చెప్పాడు.

Tags:    

Similar News