స్థానిక గిరిజనులకే వంద శాతం ఉద్యోగాలు

సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.;

Update: 2025-05-12 14:18 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2000 ఏడాదిలో జీ.వో నెంబర్‌ 3 తెచ్చామని సిఎం చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్‌ 3 పునరుద్దరణకు తీసుకావల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే.. 2020లో రద్దయిన జీ.వో నెంబర్‌ 3 పునరుద్దరణకు ఉన్న అవకాశాలపై అధ్యాయనం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. సోమవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ రివ్యూలో గిరిజన సంక్షేమ శాఖ, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్‌ పోస్టుల్లో 100 శాతం రిజర్వేషన్లు తెచ్చాం. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళ రిజర్వేషన్ల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో ఎంఎస్‌ నంబర్‌ 3 తెచ్చాం. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4,626 టీచర్‌ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్‌ 3 పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా.. వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్‌ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించింది. దీంతో రివ్యూ పిటిషన్‌ ను కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్‌ 3 ద్వారా లభించే లబ్దిని కోల్పోయారు అని సిఎం చంద్రబాబు అన్నారు.
జీవో నెంబర్‌ 3 పునరుద్దణ లేదా అదే తరహా న్యాయం చేసేందుకు గిరిజనులకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు జీ.వో నెంబర్‌ 3 రద్దు అనంతర పరిణామాలపై అధికారులతో సీఎం చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3 ద్వారా నాడు గిరిజనులకు కలిగిన లబ్దిని పునరుద్దరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాల గురించి, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకుల గురించి చర్చించారు. జీ.వో నెంబర్‌ 3 పునరుద్దరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనుల, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తిరిగి ఈ ఉత్తర్వుల ద్వారా లభించే లబ్దిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని.. ఇందులో భాగంగా న్యాయ పరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి ముందు మూడు ఆప్షన్లు
జీవో నెంబర్‌ 3 పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న మూడు అవకాశాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొదటి ఆప్షన్‌గా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో 100 శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండవ ఆప్షన్‌గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, మూడవ ఆప్షన్‌గా సుప్రీంకోర్టు సూచించినట్టు 50 శాతం మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులను పరిక్షించడం వంటి అవకాశాలను అధికారులు సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సిఎం మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకు కట్టుబడి ఉన్నామని.. ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీ.వో నెంబర్‌ 3 పునరుద్దరించడం లేదా.. అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలి అని సిఎం చంద్రబాబు అన్నారు. గిరిజనులకు న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Tags:    

Similar News