టెంపుల్ టౌన్స్లో హోమ్ స్టేలను ప్రోత్సహించాలని, ముఖ్యంగా తిరుపతితో పాటు ఇతర ప్రముఖ దేవాలయాల పట్టణాల్లో వీటిపై దష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కోనసీమలో గ్రామీణ వాతావరణం అనుభూతి చెందేలా హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలని, ఎన్ఆర్ఐలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ హోమ్ స్టేలు అన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా చూడాలన్నారు. బుధవారం సచివాలయంలో పర్యాటక శాఖపై సీఎం సమీక్షించారు. విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో నిరంతరం ఏదోక టూరిజం ఈవెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం గదుల నిర్మాణం, నూతన ప్రాజెక్టులు, పర్యాటక ఉత్సవాల నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించాలని సీఎం చెప్పారు. నిర్దేశించిన గడువులోగా వేర్వేరు పర్యాటక ప్రాంతాల్లో బస కోసం హోటల్ గదులను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
2026 మార్చి నాటికి రాష్ట్రంలో 10 వేల గదులు అందుబాటులోకి రావాలని సీఎం సూచించారు. అలాగే 2029 నాటికి 50 వేల గదుల లక్ష్యాన్ని కూడా చేరుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు స్థలాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక ప్రాంతాలు, టౌన్ షిప్ లతో పాటు పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలని అధికారులకు సీఎం చెప్పారు. కొండపల్లి ఖిల్లా లాంటి ప్రాజెక్టులను దత్తత తీసుకునేలా ప్రైవేటు భాగస్వాములను గుర్తించాలన్నారు. ఉండవల్లి గుహల వద్ద లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటుతో పాటు, చింతపల్లిలో ఎకో టూరిజం, కుప్పంలో ఏనుగుల సఫారీ, విశాఖలో డాల్ఫిన్ షో వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
వివిధ పథకాల కింద రాష్ట్రంలో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద బొర్రా గుహలు, అరకు, లంబసింగిలో పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం చెప్పారు. సూర్య లంక బీచ్ ఎక్స్ పీరియన్స్ ప్రాజెక్టు పనులను రూ.97 కోట్లతో చేపట్టామని.. 2026 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు సిద్ధం అవుతుందని వెల్లడించారు. ప్రసాద్ పథకం కింద సింహాచలం, అన్నవరం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపైనా సీఎం ఆరా తీశారు. గండికోట టెంట్ సిటీని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తైడ, అరకు, గండికోట, సూర్యలంక, బ్రిడ్జిలంక, లంబసింగి వంటి ప్రాంతాల్లో టెంట్ సిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు కింద హావ్ లాక్ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టును పర్యాటకులకు అందుబాటులోకి తేవాలన్నారు. రాజమండ్రిని స్పెషల్ టూరిజం హబ్ గా చేపట్టేలా ప్రాజెక్టులను తీసుకువచ్చే అంశం మీద దృష్టి సారించాలని సూచించారు. సుదీర్ఘ తీర ప్రాంతంలో ఆకర్షణీయమైన బీచ్ ఫ్రంట్ లను గుర్తించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హెలీ, సీప్లేన్ టూరిజానికి సంబంధించి విజయవాడ–శ్రీశైలం, గండికోట–బెంగుళూరు, విశాఖ–అరకు లాంటి కొత్త మార్గాలను కూడా గుర్తించాలని స్పష్టం చేశారు. కోనసీమలో కాటేజ్ లైఫ్, విలేజ్ లైఫ్ వచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. సీ క్రూజ్ ప్రాజెక్టులతో పాటు రివర్ క్రూయిజ్ ను కూడా ప్రోత్సహించాలన్నారు. మరోవైపు విజయవాడలో దసరా ఉత్సవాలను మైసూరు ఉత్సవాల తరహాలోనే నిర్వహించేందుకు ప్రణాళిక చేసినట్టు అధికారులు తెలిపారు.
సెప్టెంబరు 22 తేదీ నుంచి అక్టోబరు 2 తేదీ వరకూ విజయవాడలో ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే వేర్వేరు ఈవెంట్ల సమయంలో ఆయా పట్టణాలు, నగరాల్లో పండుగ శోభ వచ్చేలా విద్యుత్ దీపాలంకరణతో పండుగ శోభ వచ్చేలా చేయాలని స్పష్టం చేశారు. అలాగే సంప్రదాయ వంటకాలను కూడా ప్రోత్సహించేలా చూడాలని పేర్కోన్నారు. ఈవెంట్ల సమయంలో నగరాలు, పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రత్యేకించి విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి లాంటి నగరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
·పర్యాటకంలో అరకు కాఫీ, కూచిపూడి, ఎర్రచందనం ఉత్పత్తుల బ్రాండింగ్
పర్యాట రంగానికి మరింత శోభ తెచ్చేలా అదనపు ఆకర్షణలు జోడించటంతో పాటు, స్థానికంగా ఉన్న ఉత్పత్తులను కూడా బ్రాండింగ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేకంగా నిర్వహించే ఈవెంట్లలోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయటంతో పాటు అరుదైన ఎర్రచందనం బొమ్మలు, ఫర్నిచర్ లాంటి ఉత్పత్తులను కూడా ప్రదర్శించాలన్నారు. అలాగే మన సంప్రదాయ నృత్య కళ కూచిపూడి, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి లాంటి చేనేత క్లస్టర్లలో ఉత్పత్తయ్యే వస్త్రాలు, సేంద్రీయ ఉత్పత్తులకు కూడా బ్రాండింగ్ వచ్చేలా చేయాలని అన్నారు.
గోదావరి పుష్కరాలకు సంబంధించి ముందస్తుగా కర్టైన్ రైజర్ కార్యక్రమం నిర్వహిద్దామని మంత్రి కందుల దుర్గేష్ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సీఎం అంగీకరించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో ఫెస్టివల్ నిర్వహించవచ్చని సీఎం సూచించారు. పర్యాటకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక చిన్న సంఘటన జరిగినా మొత్తం పర్యాటక రంగం దెబ్బతింటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. శాంతిభద్రతలు, భద్రతతో పాటు పర్యాటకుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు పురాతన తెలుగు తాళ పత్ర గ్రంధాలను సీఎం పరిశీలించారు. ఈ సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్ వర్చువల్ గా, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.