ఏపీలో భారీ వర్షాలు..ఈదురుగాలుల హెచ్చరికలు

వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.;

Update: 2025-05-28 16:02 GMT

నైతురుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడటంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్రలో వీటి ప్రభావం ఎక్కువుగా ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎగువ ఉన్న ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. దీనికి తోడు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

కోస్తాంధ్రలో అధికాంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందు వల్ల గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆ మేరకు ప్రభావిత ప్రాంతాల జిల్లా అధికారులకు విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను ఆదేశించింది. మే 29 గురువారం నాడు కోస్తాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, తక్కిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News