గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ–అమరావతి డిక్లరేషన్
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎస్ కే విజయానంద్, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు సమక్షంలో సీఎం చంద్రబాబు గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల చేశారు.;
ఆంధ్రప్రదేశ్ను 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతి డిక్లరేషన్ను విడుదల చేశారు. ఇటీవల అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో గ్రీన్ హైడ్రోజన్పై సమ్మిట్ జరిగింది. ఏడు సెషన్స్గా ఎస్ఆర్ఎంలో జరిగిన ఈ సమ్మిట్లో దాదాపు 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు, విద్యుత్ తయారీ సంస్థల సీఈవోలు, ఎండీలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్లో చర్చించిన అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు డిక్లరేషన్ ప్రకటించారు.
భారత్లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్కు విధివిధానాలు రూపొందించేలా డిక్లరేషన్ను ప్రకటించారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలానేది తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పటమే ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశ్యమని సీఎం వెల్లడించారు. 2027 నాటికి 2 గిగావాట్లు, 2029 నాటికి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ చేయాలనేది లక్ష్యగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
కిలో హైడ్రోజన్ గ్యాస్ రూ.460 నుంచి రూ.160కి తగ్గించేలా పరిశోధనలు, ఆవిష్కణలు చేసేవిధంగా కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. 2029 నాటికి 25 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పంపిణీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్గా దీన్ని తీర్చిదిద్దాలని డిక్లరేషన్లో నిర్ణయంచినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పతికి అవసరమైన ఆవిష్కరణలు, పరిశోధనల కోసం రూ.500 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా కృషి చేసే 50 స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించాలని డిక్లరేషన్లో ప్రకటించారు.