పొగాకు, మామిడి రైతులకు అండగా ఉండాలి
రైతులకు ఇబ్బంది కలగకుండా పంట ఉత్పత్తుల కొనుగోలు జరగాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.;
పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరతో పాటు వివిధ అంశాలపైఅమరావతి సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇప్పటి వరకూ 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల –3, గుంటూరు––2, పలనాడు –1, ప్రకాశం – 1 కొనుగోలు కేంద్రాలు ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. వీటి ద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎంకి వివరించారు.