ప్రస్తుతం గుంటూరు, విశాఖపట్నం ప్లాంట్లల్లో 2,800 టన్నుల చెత్త నుంచి కరెంటును ఉత్పత్తి చేస్తున్నారని, నెల్లూరు, రాజమండ్రి ప్లాంట్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపడుతున్నామని, ఇవన్నీ పూర్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా 7500 టన్నుల చెత్త నుంచి ప్రతి రోజూ కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి ఏపీ వెళ్లి పోతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపల్ శాఖ మీద ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనతంరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమృత్ పథకం ద్వారా తాగు నీరు అందించేందుకు పైపులైను పనుల నిమిత్తం శనివారం టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
2014–19 మధ్య కాలంలో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుంచి అనేక నిధులను తీసుకొచ్చామన్నారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) నుంచి రూ. 5800 కోట్లు, స్వచ్ఛ భారత్ నుంచి రూ. 3000 కోట్లు విడుదలకు ఆమోదం తీసుకున్నట్లు తెలిపారు. అయితే గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆ నిధులు మధ్యలోనే నిలిచిపోయాయని.. మళ్లీ ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అమృత్ పథకం కింద బోర్ల నుంచి కాకుండా నదులు, కాలువల నీటిని ఇళ్లకు సరఫరా చేస్తామన్నారు. ఏఐఐబీ నుంచి వచ్చే రూ. 5350 కోట్లతో మిగిలిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు, డ్రైనేజి పైప్ లైన్లు పూర్తి చేస్తామన్నారు. ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో వందశాతం ఇళ్లకు రక్షిత నీరు అందుతుందన్నారు. ఈ నిధులకు సంబంధించి రాష్ట్ర వాటా ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఆర్ధిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. శుద్ది చేసిన నీటిని డ్రైనేజిల్లోకి వదిలేలా ఎస్టీపీలను కూడా 2029కి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన 85 లక్షల మట్రిక్ టన్నుల చెత్తను ను వచ్చే అక్టోబర్ రెండో తేదీ నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు.
2014–19 మధ్య కాలంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించగా...గత ప్రభుత్వం వాటిని 2,60,000కు తగ్గించిందన్నారు. ఈ ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకుండానే లోన్లు తీసుకోవడంతో నాన్ పేమెంట్ కేటగిరీలోకి వెళ్లిపోయాయన్నారు. దీని కోసం సుమారు రూ. 140 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందన్నారు. వీటిని పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. మున్సిపాల్టీల్లో ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.