కొంప ముంచిన సరదా ఈత

చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.;

Update: 2025-06-08 09:17 GMT

పోయిన నెలలో కోనసీమ జిల్లా మమ్ముడివరం మండలంలో సరదా ఈత కోసం గోదావరిలోకి దిగి ఎనిమిది మంది మృత్యువాత పడిన ఘటన నుంచి తేరుకోక ముందే ఆదివారం మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సరదా ఈత కోసం చెరువులోకి దిగిన ముగ్గరు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ పరిధిలోని గంగవలస గ్రామానికి చెందిన కొర్ర సుశాంత్‌తో పాటు కోతంగి పంచాయతీ పరిధిలోని బిల్లాపుట్‌ గ్రామానికి చెందిన గుంట భానుతేజ, సాయికిరణ్‌లు సరదాగా ఈత కొట్టేందుకు గుంటసీమ జంగమయ్య ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువులోకి దిగారు. లోతు ఎక్కువుగా ఉండటంతో ఈతకు దిగిన ముగ్గురు పిల్లలు ఊపిరి ఆడక మృతి చెందారు. ఈ దుర్ఘటనతో గుంటసీమ, గంగవలస, బిల్లాపూర్‌ చుట్టుపక్కల గ్రామాల్లో విషాదం నెలకొంది. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులను సైతం ఈ ఘటన కన్నీరుపెట్టించింది.

కోనసీమ జిల్లాలో కూడా ఇటీవల ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు ప్రాంతంలోని సలాదివారిపాలెంలో సరదా ఈతకు దిగిన ఎనిమిది మంది యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఓ శుభకార్యానికి వచ్చిన 11 మంది యువకులు సరదా ఈత కోసం గోదావరిలోకి దిగారు. వీరిలో ఎనిమిది మంది నీటిలో మునిగి పోయారు. క్రాంతి మన్యూల్, సబ్బిత పాల్‌ మాన్యూల్, తాతపూడి నితీష్, ఎలుపర్తి సాయి, వడ్డి మహేష్, వడ్డి రాజేషలు గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
Tags:    

Similar News