విజయవాడలో అగ్నిప్రమాదం..గుంటూరులో దొంగనోట్లు కలకలం
గోపిరెడ్డి, జ్యోతిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.;
By : The Federal
Update: 2025-08-08 07:30 GMT
విజయవాడ నగరంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బందరు రోడ్డులోని కేఎఫ్సీ భవనం వద్ద ఈ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో కరెంట్ షార్ట్సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీని వల్ల పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉన్న ఏడు బైక్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మరో వైపు గుంటూరులో దొంగనోట్ల చెలామణి కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు దొంగ నోట్లను మారుస్తూ పోలీసులకు పట్టబడ్డారు. గుంటూరు నగరంలోని రత్నగిరి కాలనీకి చెందిన గోపిరెడ్డి, జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు డూప్లికేట్ 500 రూపాయల నోట్లను మార్చేందుకు ప్రయత్నించారు. వీరిపైన, నోట్లపైన అనుమానాలు వచ్చిన స్థానికులు గోపిరెడ్డి, జ్యోతిలను నిలదీశారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు స్థానికుల అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అవి దొంగనోట్లే అని స్థానికుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా గోపిరెడ్డి, జ్యోతిలతో పాటు ఉన్న మరో వ్యక్తి డూప్లికేట్ నోట్లు ఉన్న బ్యాగ్ను తీసుకొని పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోపిరెడ్డి, జ్యోతిలను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గోపిరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అదుపులో ఉన్న గోపిరెడ్డి, జ్యోతిలను పోలీసులు విచారిస్తున్నారు.