ఏలూరు సాక్షి కార్యాలయం ఫర్నీచర్ కు నిప్పు

అమరావతి మహిళలపై సాక్షి టీవీ డిబేట్ లో వచ్చిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మూడు రోజులుగా మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి.;

Update: 2025-06-10 16:30 GMT
ఏలూరు సాక్షి సిటీ ఆఫీసులో కాలిపోతున్న ఫర్నీచర్

మూడు రోజులుగా ఏపీలో సాక్షి టీవీ చానల్ లో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన డిబేట్ లో మహిళలను అవమానించినందుకు నిరసనగా ఆందోళన కొనసాగుతోంది. సాక్షి కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయం వద్ద మూడు రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. సాక్షి దినపత్రికలు కాల్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా పలు  నియోజకవర్గాల్లో ఆందోళన చేస్తున్నారు. 

మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళలు ఏలూరు సాక్షి కార్యాలయం వద్దకు వచ్చి సెల్లార్ లో ఉన్న సాక్షి కార్యాలయానికి సంబంధించిన పాత ఫర్నీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో రెండు సోఫాసెట్స్ కాలిపోయాయి. సాక్షి కార్యాలయానికి అద్దెకు భవనాన్ని ఇచ్చిన ఓనర్ కార్యాలయం వెనుక వైపున ఉంటారు. ఆయన కారు సెల్లార్ లో ఉంటుంది. ఈ సోఫాలకు నిప్పంటించడంతో పక్కనే ఉన్న ఓనర్ కారుకు కూడా నిప్పంటుకుని పాక్షికంగా కాలిపోయింది. ప్రింటింగ్ ఆఫీసులు మినహా మిగిలిన ఆఫీసులు సాక్షి పత్రిక వారు అద్దెలకు తీసుకున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉంటే కార్యాలయాల్లో పత్రికతో పాటు జిల్లా సాక్షి టీవీ రిపోర్టర్లు కూడా ఉంటారు. ఈ సంఘటనపై బుధవారం పోలీసులకు సాక్షి వారు ఫిర్యాదు చేయనున్నారు.

సెక్షన్స్ మీ ఇష్టం వచ్చినట్లు వేస్తారా?

కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో మంగళవారం ఉదయం హాజరు పరిచారు. ఈ కేసులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసేందుకు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ విభాగం నాయకులు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పోలీసులు అందజేసిన రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. మీ వద్ద ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరారు. పోలీసులు మౌనం వహించడంతో కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు జడ్జి చెప్పారు.


ప్రాథమిక హక్కును పోలీసులు కాల రాసారు: పొన్నవోలు సుధాకర్ రెడ్డి

నిందితుని తరపున వకాల్తా తీసుకునేందుకు వచ్చిన న్యాయవాదులను పోలీసులు అనుమతించాలి. లేదా పౌరులకు రాజ్యాంగ పరంగా ఉండే ప్రాథమిక హక్కు ప్రకారం తన తరుపున వాదించే న్యాయ వాది వచ్చినప్పుడు వకాల్తా కోసం ఇవ్వాల్సిన కాగితాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ కాగితాలపై సంతకాలు తీసుకునేందుకు న్యాయవాదిగా నేను వెళుతుంటే పోలీసులు బయటకు నెట్టారని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి పోలీసులను రిక్వెస్ట్ చేసి వకాల్తా సంతకాలు తీసుకోవాల్సి వచ్చిందని, వకాల్తా పుచ్చుకునే న్యాయవాదిని అడ్డుకునే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని పొన్నవోలు ప్రశ్నించారు. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ లో మాట్లాడిన మాటలు పూర్తిగా జడ్జిగారికి అందించాము. పోలీసులు కేసులో వేసిన సెక్షన్స్ కు సంబంధించిన మాటలు ఒక్కటి ఉన్నా ఆయనకు బెయిల్ పిటీషన్ వేయనని చెబుతూ తప్పుడు ఎఫ్ఐఆర్ లు రాసిన పోలీసులు, వారిని వెనుకనుండి నడిపిస్తున్న నాయకులను త్వరలోనే కోర్టులో నిలబెడతానని పొన్నవోలు సుధాకర్ రెడ్డి శపథం చేశారు.

Tags:    

Similar News