ఏపీలో డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి
జెన్కో అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు.;
గృహ, పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలని,జెన్కో ప్లాంట్లలో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఏపీ జెన్కో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మూడు థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి, రోజువారీ విద్యుత్ కొనుగోళ్లు పై ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగానికి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. అంతేగాకుండా గతంతో పోల్చితే రోజు వారి విద్యుత్ కొనుగోళ్లు తగ్గినట్లు తెలిపారు.
ఏపీ జెన్కో –ఏపీపీడీసీఎల్ సంయుక్తంగా 2025 ఆగస్టు వరకు 16,000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 20.3 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడంపై మంత్రి గొట్టిపాటి హర్షం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాల్లో తొలిసారి శ్రీశైలం హైడల్ పవర్ స్టేషన్ 1,000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరడంపై అధికారులను అభినందించారు. కేవలం ఏడాది కాలంలోనే జల విద్యుత్ ఉత్పత్తి 36% మేర ఉత్పత్తి సాధించడం భవిష్యత్తు అవసరాలను తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.