కృష్ణా తీరానా కనుల విందుగా డ్రోన్‌ షో

విజయవాడ కృష్ణా తీరంలో అతి పెద్ద డ్రోన్‌ షో నిర్వహించారు. ప్రదర్శించిన డ్రోన్‌ కళాకృతులు ఆకట్టుకున్నాయి.

Update: 2024-10-22 16:32 GMT

విజయవాడ కృష్ణా తీరంలో అతి పెద్ద డ్రోన్‌ షో నిర్వహించారు. ప్రదర్శించిన డ్రోన్‌ కళాకృతులు ఆకట్టుకున్నాయి. ఈ డ్రోన్‌ షో ఆరు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. లార్జెస్ట్‌ ప్లానెట్‌ ఫార్మాషన్, లార్జెస్ట్‌ ల్యాండ్‌ మార్క్‌ సృష్టి, లార్జెస్ట్‌ పేన్‌ ఫార్మేషన్, డ్రోన్‌ల ద్వారా జాతీయ జెండా ప్రదర్శన, ఏరియల్‌ లోగోతో వంటి రికార్డులను నెలకొల్పింది. ఈ రికార్డులకు సంబంధించిన సర్టిఫికేట్లను సీఎం చంద్రబాబు గిన్నీస్‌ బుక్‌ ప్రతినిధులకు అందజేశారు. మంగళవారం విజయవాడ కృష్ణా తీరం పక్కన పున్నమి ఘాట్‌ వద్ద నిర్వహించిన డ్రోన్‌ షో ఆకట్టుకుంది. దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షో ఇది. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు వీటిని ప్రారంభించారు. అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ లో భాగంగా దీనిని నిర్వహించారు. ఈ డ్రోన్‌ షో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విజన్‌ను చాటే విధంగా, ఆధునిక టెక్నాలజీ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న మక్కువను తెలియజేసే విధంగా ప్రదర్శనలు చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం 5 వేలకు పైగా డ్రోన్లు గాల్లోకి లేచాయి. డ్రోన్ల ద్వారా వివిధ కళాకృతుల రూపాల్లో ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విమానం, బుద్ధుడు, గ్లోబ్‌పై భారతదేశపు మ్యాప్, డ్రోన్‌ కల్చర్, 1911 నాటి పోస్టల్‌ స్టాంపు, భారత త్రివర్ణ పతాకం ఇలా అనేక రూపాల్లో డ్రోన్‌ లైటింగ్‌ షోలు చూపరులను కనులవిందు చేశాయి. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే ఈ డ్రోన్‌ షోను ప్రజలు తిలకించేందుకు వీలుగా విజయవాడలో ఐదు చోట్ల డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డ్రోన్‌ హ్యాకథాన్‌ విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

Tags:    

Similar News