ఆ కేసును కొట్టేయండి–కోర్టులో జగన్ క్వాష్ పిటీషన్
జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మరణించడంతో కేసు జగన్తో పాటు మరి కొందరిపైన కేసు నమోదు చేశారు.;
By : The Federal
Update: 2025-06-25 10:35 GMT
రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న సింగయ్య మృతి కేసు మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య మృతికి సంబంధించి పోలీసులు తన మీద నమోదు చేసిన కేసును కొట్టేయాలని జగన్ కోర్టును కోరారు. ఆ మేరకు ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ను దాఖలు చేశారు. జగన్ దాఖలు చేసుకున్న ఈ క్వాష్ పిటీషన్ మీద గురువారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్ ఏపీ కేఎన్ఆర్లు కూడా తమ మీద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ పిటీషన్ల మీద కూడా హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరించనుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రెంటపాళ్ల పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించాడని గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏ1 నిందితుడుగాను, జగన్ను ఏ2గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు.
జగన్తో పాటు ఆ కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని, విడదల రజని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్ పీఏ కేఎన్ఆర్లను కూడా నిందితులుగా పేర్కొంటూ వారిపైనా కేసు నమోదు చేశారు. దీంతో వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.