రెండో రోజు సిట్‌ విచారణకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి

గోవిందప్పను కస్టడీకి కోరుతూ ఇప్పటికే కోర్టును కోరిన సిట్‌ అధికారులు.;

Update: 2025-05-15 07:01 GMT

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి రెండో రోజు సిట్‌ విచారణకు హజరయ్యారు. బుధవారం జరిగిన విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మరో సారి కూడా విచారణకు హాజరు కావాలని సిట్‌ అధికారులు ఆదేశించడంతో గురువారం రెండో విచారణకు హాజరయ్యారు. గురువారం సాయంత్రం వరకు వీరిద్దరిని సిట్‌ అధికారులు విచారణ చేపట్టనున్నారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన ప్రశ్నలు సంధించనున్నారు.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు రాజ్‌ కసిరెడ్డిలు ఇచ్చిన వాంగ్మూలం మేరకు సిట్‌ అధికారుల ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. లిక్కర్‌ స్కామ్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు చెబుతున్న నేపథ్యంలో సిట్‌ అధికారులు వీరిని వేరు వేరుగా విచారణ చేపట్టనున్నారు. సిట్‌ అధికారులు మాత్రం లిక్కర్‌ స్కామ్‌లో వీరిద్దరి పాత్ర ఉందని నమ్ముతున్నారు. ఈ దిశగా విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే బుధవారం జరిగిన విచారణలో సరిగా సమాధానాలు చెప్పని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు గురువారం విచారణలో అయినా సరైన సమాధానలు చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరో వైపు ఇదే మద్యం కుంభకోణం కేసులో ఏ33 నిందిడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవిందప్ప బాలాజీని ఇప్పటికే విజయవాడ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు మే 20 వరకు గోవిందప్పకు రిమాండ్‌ విధించింది. లిక్కర్‌ కేసులో గోవిందప్ప కీలక నిందితుడుగా ఉన్నారని, విచారణ చేపట్టేందుకు కస్టడీకి అప్పగించాలని సిట్‌ అధికారులు ఇప్పటికే కోర్టును కోరారు. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News