అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు : ఏపీ హోం మంత్రి అనిత

అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు తీసుకుంటామని వడ్డీ వ్యాపారులను ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి అనిత హెచ్చరించారు.

Update: 2024-10-02 13:01 GMT

వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఏలూరు కాల్‌ మనీ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. కుస్తీలకు ముందే వడ్డీ కోతతో పాటు గడువు దాటిందనే సాకుతో డబుల్‌ కుస్తీలు వసూలు చేసే కాల్‌ మనీ వ్యాపారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లకు పాల్పడి వేధింపులకు గురి చేస్తే క్రిమినల్‌ చర్యలు చేపడుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. వసూళ్ల పేరుతో అమాయక ప్రజలను జలగల్లా పీల్చిపిప్పి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు ఎస్పీతో హోంమంత్రి అనిత మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వడ్డీ వ్యాపారాలపై సీరియస్‌ గా చర్యలు తీసుకుంటామన్నారు.

బుధవారం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగని విధంగా పటిష్టంగా భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు నేటితో 12 ఏళ్లు అన్నారు. నవరాత్రుల సందర్భంగా పటిష్ట బందోబస్తుతో భద్రతను పర్యవేక్షించడం కోసం పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో విజయవాడ కమాండ్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల రక్షణ వలయం ఇంద్రకీలాద్రి చుట్టూ ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Tags:    

Similar News