ఒకపక్క దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఈ కేసులు మళ్లీ వెలుగు చూసిన మొదట్లో దేశవ్యాప్తంగా రోజుకు పదుల సంఖ్యలో నమోదయ్యేవి. క్రమంగా అవి వందలకు చేరుకునే పరిస్థితి తలెత్తుతోంది. దీంతో పాటు అక్కడక్కడ కోవిడ్ మరణాలూ సంభవిస్తుండడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి వచ్చిన కరోనా ఏమంత ప్రమాదకరం కాదని చెబుతున్నప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య ఊపందుకోవడం, మరణాలు నమోదవుతుండడం వంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. ఈ ఏడాది తాజాగా ప్రబలుతున్న కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ ఇప్పటివరకు దేశంలో ఐదు వేల మందికి పైగా సోకినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో మరణాలు 51 వరకు ఉన్నాయి. కోవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను పరిశీలిస్తే అత్యధికంగా కేరళలో 1500 మంది, మహారాష్ట్ర, ఢిల్లీల్లో 500కి పైగా, పశ్చిమ బెంగాల్లో 350, గుజరాత్, కర్నాటకల్లో 300 చొప్పున రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 50, తెలంగాణలో ముగ్గురికి కోవిడ్ సోకినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తొలి కోవిడ్ కేసు గత నెలలో విశాఖపట్నంలోనే నమోదైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే తొలి కోవిడ్ మరణం (64 ఏళ్ల వ్యక్తి) కూడా విశాఖలోనే సంభవించింది. ఆ వ్యక్తి కోవిడ్తోనే మరణించాడని ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా, అధికార యంత్రాంగం మాత్రం కేజీహెచ్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించనందున అది కోవిడ్ మరణంగా గుర్తించడం లేదని తేల్చేసింది. తాజాగా గురువారం విశాఖలో 14 ఏళ్ల బాలికకు కోవిడ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వైజాగ్లో కరోనా సోకిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కేసులు నమోదుతో విశాఖలో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ కేసు గత నెల 23న వెలుగు చూసిన వెంటనే విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో 40 పడకలు, విమ్స్ (విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో 20 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. కోవిడ్ అనుమానిత లక్షణాలున్న వారికి అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం 50 చొప్పున ర్యాపిడ్ కిట్లను అందుబాటులో ఉంచారు.
టీటీడీలో అలా.. విశాఖలో ఇలా?
రోజురోజుకూ కోవిడ్ వ్యాప్తి చెందుతున్న వార్తల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. తిరుపతి, తిరుమలకు వచ్చే భక్తులతో పాటు దేవస్థానం ఉద్యోగులు కూడా కోవిడ్పై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తాజాగా విడుదల చేసిన అత్యవసర సర్క్యులర్ ద్వారా నిర్దేశించింది. కోవిడ్పై ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలు, క్యూ కాంప్లెక్స్లు, వసతి సముదాయాలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో జన సమ్మర్థతను తగ్గించాలని, ప్రార్థనా కార్యక్రమాలను నిలువరిచాలని సూచించింది. అలాగే వృద్ధులు, గర్భిణిల పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించింది. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, మనుషుల మధ్య దూరాన్ని పాటించడం వంటివి అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఒకపక్క కోవిడ్పై టీటీడీ అప్రమత్తమవుతుంటే కరోనా కేసులు, మరణాలు నమోవుతున్న విశాఖపట్నంలో లక్షలాది మందితో ప్రధాని మోదీ సమక్షంలో యోగా డే కార్యక్రమాన్ని చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వైజాగ్లో యోగా డేను రద్దు చేయాలి..
దేశంలోనూ, రాష్ట్రంలోనూ, విశాఖలోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైజాగ్లో ఈనెల 21న తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ యోగా దినోత్సవాన్ని ఐదు లక్షల మందితో నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. సర్వత్రా కోవిడ్ ఆందోళనకర పరిస్థితులున్నప్పటికీ వైజాగ్లో లక్షలాది మందితో సామూహికంగా యోగా డేను కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయం ఆందోళన కలిగిస్తోందని ప్రజా ఆరోగ్య వేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విశాఖలో నిర్వహించ తలపెట్టిన యోగా డేను రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రజా ఆరోగ్య వేదిక తాజాగా లేఖ రాసింది. లక్షలాది మంది మరణాలకు దారితీసిన కోవిడ్–19 రెండవ దశ నుంచి మనకు గతంలో చేదు అనుభవం ఉంది. అప్పటి సామూహిక సమావేశాలు కోవిడ్ విపత్కర వ్యాప్తికి దారితీశాయి.
మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ముంచెత్తి అపారమైన బాధలను కలిగించాయి. ఈ ఆందోళనలకు తోడు ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఇటీవల ఒక ప్రకటనలో కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. కోవిడ్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెద్ద సమావేశాలను నిలువరించాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరి చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో విశాఖలో లక్షలాది మందితో యోగా డే నిర్వహించడం, దానికి ప్రధాని మోదీ హాజరవుతుండడం విషాదం పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ప్రజారోగ్య వనరులు సరిపోయినంతగా లేక ఆరోగ్య సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. వైద్య సిబ్బందిని ఈ కార్యక్రమానికి కేటాయించడం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కోవిడ్ లక్షణాలతో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపవద్దని సూచించింది. ఇది జాగ్రత్త అవసరాన్ని తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి మెగా యోగా డేను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మందితో కాకుండా వర్చువల్గా లేదా చిన్నతరహా యోగా కార్యక్రమాన్ని నిర్వæహించాలని కోరుతున్నాం’ అని సీఎంకు పంపిన లేఖలో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ రమణయ్య, టి.కామేశ్వరరావులు డిమాండ్ చేశారు.