టీడీపీ నేతలకు చంద్రబాబు తీపికబురు

పదిరోజుల్లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని గడువు నిర్దేశించిన పార్టీ అధినేత;

Update: 2025-07-13 08:55 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగుదేశం నాయకులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చల్లటి కబురు అందించారు. ఖాళీగా వున్న నామినేటెడ్ పోస్టుల భర్తీని పది రోజుల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో ఆలయ కమిటీలు, మార్కెట్‌ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఛైర్‌పర్సన్లు, సభ్యుల పోస్టులను భర్తీ చేయాల్సివుంది. వాటికోసం ఇప్పటికే అన్ని జిల్లాలలో నేతలు పైరవీలు చేసుకుంటున్నారు. కాగా అభ్యర్థుల ఎంపికను ఈ నెల 15లోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గడువు నిర్దేశించారు.ఇప్పటికే ఈ పదవుల కోసం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ప్రతిపాదించిన పేర్లను పార్టీ కార్యాలయంలో జల్లెడపడుతున్నారు.రాష్ట్రంలో 900 దేవాలయాలకు ఛైర్మన్లు, కమిటీ సభ్యుల్ని నియమించాలి. మార్కెట్‌ కమిటీల్లోనూ చాలావరకు భర్తీచేయాలి. రాష్ట్రంలోని 2028 పీఏసీఎస్‌లకు గాను ఇటీవలే 491 సొసైటీలకు ఛైర్మన్, ఇద్దరు సభ్యులతో కమిటీలను నియమించారు. మిగతా వాటికి త్వరలోనే కమిటీలు వేయనున్నారు.

ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలతో పాటు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా కార్యకర్తల అభిప్రాయం సేకరించాక తుది జాబితాల్ని ఖరారు చేయనున్నారు.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్ర, శనివారాల్లో పలువురు ఎమ్మెల్యేలతో ఇదే విషయమై ఫోన్‌లో చర్చించారు.ఇంకాపేర్లు ప్రతిపాదించని వారు, మార్పులు చేర్పుల జాబితాలు అర్జెంట్ గా పంపాలని కోరారు. ఈ పదవుల కోసం క్రిందిస్థాయి నేతలు పలువురు ఎంతో ఆశపెట్టుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో కుదిరిన అవగాహన ప్రకారం జనసేన, బీజేపీ లకు నామినేటెడ్‌ పదవుల పంపిణీ జరుగుతుంది. అందుకే కూటమి పార్టీల ఎమ్మెల్యేల నుంచీ జాబితాలు తీసుకున్నారు.ఏదేమైనా ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్వరగా నామినేడెట్ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News